Begin typing your search above and press return to search.

తెల్లవారుజామున అన్న ఫ్యామిలీలో ముగ్గుర్ని చంపేసిన సొంత తమ్ముడు

By:  Tupaki Desk   |   1 Sep 2021 3:03 AM GMT
తెల్లవారుజామున అన్న ఫ్యామిలీలో ముగ్గుర్ని చంపేసిన సొంత తమ్ముడు
X
తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వరంగల్ లో దారుణం చోటు చేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ.. అన్నతో నెలకొన్న ఆర్థిక వివాదంపై ఆగ్రహంతో ఉన్న సొంత తమ్ముడు.. కుటుంబంపై దాడికి పాల్పడి ఏకంగా ముగ్గురిని చంపేసిన షాకింగ్ ఉదంతం చోటుచేసుకుంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

వరంగల్ ఎల్బీ నగర్ లో చాంద్ బాషా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి తన తమ్ముడు షఫీతో ఏడాదిగా పశువుల వ్యాపారంలో వివాదాలు ఉన్నాయి. రూ.కోటి వద్ద వారికి గొడవలు ఉన్నాయి. దీంతో అన్న మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్న తమ్ముడు షఫీ.. అన్న ఇంటికి వెళ్లి ఆయన కుటుంబం మీద దాడికి పాల్పడ్డాడు. తనతో పాటు మరికొందరిని కూడా అన్న ఇంటికి తీసుకెళ్లిన అతడు.. ఇంటి తలుపుల్ని కట్టర్ సాయంతో తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు.

ఆ సమయంలో గాఢ నిద్రలో ఉన్న అన్న చాంద్ బాషాతో పాటు ఆయన సతీమణి సబీరా బేగం.. కొడుకులు.. బావమరిదిపై కత్తితో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ ఉదంతంలో అన్న చాంద్ బాషా.. వదిన సబీరా బేగం.. బావమరిది ఖలీం అక్కడికక్కడే మరణించగా.. కొడుకులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

ఈ దారుణానికి షఫీనే పాల్పడినట్లుగా చాంద్ బాషా కుమార్తె పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు.