Begin typing your search above and press return to search.

కలకలం : మనిషి తల నరికి పోతురాజు కాళ్ల దగ్గర పెట్టారు

By:  Tupaki Desk   |   10 Jan 2022 4:35 AM GMT
కలకలం : మనిషి తల నరికి పోతురాజు కాళ్ల దగ్గర పెట్టారు
X
మానవత్వం మంటగలుస్తోంది. పగలూ ప్రతీకారాలతో మనిషి విచక్షణ కోల్పోతున్నాడు. సమాజంలో విశృంఖలత్వంతో వైషమ్యాలు పెరిగి దారుణాలు చోటుచేసుకున్నాయి. తాజాగా పోతురాజు విగ్రహం ముందు ఒక మనిషి తలనరికి కాళ్ల దగ్గర పెట్టిన వైనం కలకలం రేపింది. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో వెలుగుచూసింది.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీలోని మైసమ్మ గుడి వద్ద కనిపించిన ఈ దారుణం చూసి ప్రజలంతా హడలిపోయారు. భయంతో వణికిపోయారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి అతడి తలను గుడి ఎదుట పోతురాజు కాళ్ల దగ్గర దుండగులు పడేసి వెళ్లిపోయారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు చేపట్టారు.

ఇక హత్యనా? లేక నరబలినా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. పోతురాజు విగ్రహం వద్ద తల పెట్టడంతో ఇది నరబలినా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ తల ఎవరిదన్నది గుర్తిస్తే కేసు చిక్కుముడి వీడనుంది.

మైసమ్మ గుడి ముందు మెడలో బొమ్మ తలల దండతో ఉన్న పోతురాజు విగ్రహం కాళ్ల వద్ద మనిషి శరీరం నుంచి వేరుచేసిన తలను వదిలివెళ్లారు దుండగులు. ఈ భయానక ఘటన ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.