Begin typing your search above and press return to search.

తప్పును ప్రశ్నించిన పూజారిని చెర్నాకోలుతో కొట్టటం ఏమిటి జగన్?

By:  Tupaki Desk   |   1 Dec 2020 12:15 PM IST
తప్పును ప్రశ్నించిన పూజారిని చెర్నాకోలుతో కొట్టటం ఏమిటి జగన్?
X
కొన్ని ఘటనలు అస్సలు జరగొద్దు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న షాకింగ్ ఉదంతం చేస్తే.. నోట మాట రాదంతే. తప్పును తప్పుగా ఎత్తి చూపిన ఒక గౌరవనీయ వ్యక్తిని అత్యంత దారుణంగా.. విచక్షణా రహితంగా దాడి చేయటమే కాదు.. శారీరకంగా హింసకు గురి చేసిన తీరు చూస్తే నోట మాట రాదంతే. జగన్ ప్రభుత్వ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకారం క్షేత్రం ఉంది. ఆలయ ఆర్చకులుగా మృగపాణి అతని తండ్రి పని చేస్తుంటారు. ఆలయంలో దర్శనం కోసం భక్తుల నుంచి ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదు. కానీ.. అందుకు భిన్నంగా ఆలయ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న పిట్టం ప్రతాపరెడ్డి మాత్రం టికెట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఆలయ ఆర్చకులు. దీంతో.. ఆలయ సిబ్బందికి.. ఆర్చకుల మధ్య వాదన చోటు చేసుకుంది.

తన నిర్ణయాన్ని ప్రశ్నించారన్న ఆగ్రహంతో ఆలయ పూజారులపై ప్రతాపరెడ్డి చెర్నాకోలుతో దారుణంగా దాడి చేశారు. దీంతో.. ఆలయ అర్చకులు వీపు మీద వాతలు తేలాయి. ఈ పరిణామం షాకింగ్ గా మారింది. తప్పును వేలేత్తి చూపారన్న కారణంగా.. ఇంత అనాగరికంగా దాడి చేస్తారా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమపై జరిగిన దాడి గురించి ఆలయ ఆర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్చకులపై దాడిని వివిధ వర్గాల వారు ఖండిస్తున్నారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాదు.. ఏపీ వ్యాప్తంగా ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఇలాంటి చేష్టలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఆలయ ఛైర్మన్ అయితే మాత్రం భూస్వామి తరహాలో దాడి చేయటం అనాగరికం. దీనిపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.