Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ పేరుతో మరదల్ని లైన్లోకి దించిన నిండా ముంచేశాడు

By:  Tupaki Desk   |   7 Oct 2021 5:43 AM GMT
ఫ్రెండ్ పేరుతో మరదల్ని లైన్లోకి దించిన నిండా ముంచేశాడు
X
స్నేహం.. స్నేహితుడు లాంటి తీపి మాటలు చెప్పి.. అడ్డంగా బుక్ చేయటమే కాదు.. అసలు విషయం తెలిసేసరికి రూ.1.20 కోట్లకు టోపీ పెట్టించిన వైనం తాజాగా వెలుగు చేసింది. విస్మయానికి గురి చేసేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే దిమ్మ తిరిగిపోవాల్సిందే. స్నేహితుడిగా నటిస్తూ.. అతడికి సంబంధించిన విషయాల్ని తెలుసుకొని.. పక్కా ప్లాన్ తో తన మరదల్ని ఎరగా వేశారు. హైదరాబాద్ చెందిన బావా మరదళ్లు కలిసి.. గుంటూరుకు చెందిన వ్యక్తిని అడ్డంగా బుక్ చేయటమే కాదు.. నిలువునా ముంచేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఏపీలోని గుంటూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పనుల మీద తరచూ హైదరాబాద్ కు వస్తుండేవాడు. ఈ సందర్భంగా అంబర్ పేటకు చెందిన సాయిరాం అనే వ్యక్తి పరిచయమయ్యాడు. సుబ్బారెడ్డికి కోట్లలో ఆస్తులు ఉన్నాయని తెలుసుకున్నాడు. అతడి నుంచి డబ్బులు లాగేసేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా తన మరదలు అర్చన అలియాస్ సంజనను.. ఆమె స్నేహితుడు అనిల్ కుమార్ ను రంగంలోకి దింపాడు.

ఈ సందర్భంగా సుబ్బారెడ్డి అలవాట్లు.. బలహీనతలు తెలిపారు. దీంతో అల్లుకుపోయిన అర్చన.. వాట్సాప్ లో పరిచయం పెంచుకొని.. తరచూ చాటింగ్ చేసేది. తనకు హైదరాబాద్ లో బ్యూటీపార్లర్ ఉందని.. ఆర్థిక సాయం చేయాలని కోరింది. ఆమె చెప్పిందంతా నిజమని నమ్మటం.. అప్పటికే వారి చాటింగ్ ఒక స్థాయి దాటినట్లుగా సమాచారం. దీంతో.. ఆమెనునమ్మిన సుబ్బారెడ్డి దఫాలుగా రూ.1.20 కోట్లను వసూలు చేసింది. కొద్ది రోజులకు అర్చన తీరుపై అనుమానం వచ్చిన సుబ్బారెడ్డి.. క్రాస్ చెక్ చేసుకోగా.. తాను మోసపోయినట్లుగా గుర్తించారు.

వెంటనే పోలీసులకు కంప్లంట్ ఇవ్వగా.. ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. స్నేహంగా ఉన్నట్లు నటించి.. నిలువునా ముంచేసిన సాయిరాం ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.