Begin typing your search above and press return to search.

అర్థంకాని ఆన్ లైన్ క్లాసులు.. ప్రాణాలు తీసుకున్న విద్యార్థి

By:  Tupaki Desk   |   23 Nov 2020 3:00 PM IST
అర్థంకాని ఆన్ లైన్ క్లాసులు.. ప్రాణాలు తీసుకున్న  విద్యార్థి
X
కరోనా ప్రభావం మొదలైన తర్వాత ఈ రంగం అని రంగం అని లేదు అన్ని చోట్లా సమస్యలే. చివరికి విద్యారంగంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా పడింది. వైరస్ తీవ్రత అధికంగా ఉండడంతో పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వ మూసివేసింది. అయితే విద్యాసంవత్సరం కుంటు పడకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే చాలామందికి ఈ ఆన్లైన్ తరగతులు అర్థం కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

కొంతమంది పాఠాలు అర్థం కావడం లేదంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు విద్యార్థులు ఆన్లైన్ తరగతులు అర్థం కాక పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చు కొంటున్నారు. ఇంట్లో మందలిస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. పాఠశాలలో సహజ పద్ధతిలో పాఠాలు వినే విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను ఎంతవరకు అర్థం చేసుకోగలరనే విషయమై అర్థం కొద్దిరోజులుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ విద్యార్థి ఆన్లైన్ క్లాసులు అర్థం కాక ఆత్మహత్యకు పాల్పడడం విషాదంగా మారింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీ ఈ ప్రాంతానికి చెందిన సత్యనారాయణ కుమారుడు దినేష్(18) గొల్లపూడి లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ప్రస్తుతం వీరికి కరోనా కారణంగా ఆన్లైన్ తరగతుల ద్వారా బోధిస్తున్నారు. అయితే దినేష్ కు ఈ పాఠాలు అర్థం కావడం లేదు. ఆన్లైన్ పాఠాలు అర్థం కాక చదువులో వెనకబడుతున్నట్లు తోటి విద్యార్థులు హేళన చేస్తున్నారని దినేష్ మనస్తాపం చెందాడు.

దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్న ఆ విద్యార్థి ఈనెల 13వ తేదీన పురుగుల మందు సేవించాడు. అది గుర్తించిన కుటుంబ సభ్యులు మెరుగైన వైద్యం కోసం అతడిని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన దినేష్ పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. చేతికొచ్చిన కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.