Begin typing your search above and press return to search.

నంద్యాల మీద ప‌ట్టుబిగిస్తున్న శిల్పా

By:  Tupaki Desk   |   29 Jun 2017 4:31 AM GMT
నంద్యాల మీద ప‌ట్టుబిగిస్తున్న శిల్పా
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల రాజ‌కీయం అంత‌కంత‌కూ వేడెక్కుతోంది. ఏపీ టీడీపీ నేత భూమా నాగిరెడ్డి అకాల మ‌ర‌ణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉప ఎన్నిక‌కు ఎలాంటి అధికార ప్ర‌క‌ట‌న చేయ‌న‌ప్ప‌టికీ.. ఆ దిశ‌గా అధికార‌.. విపక్ష నేత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు ముందే.. అధికార‌.. విప‌క్షాలు త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేయ‌టం.. ఆ దిశ‌గా వారు త‌మ ప్ర‌య‌త్నాలు షురూ చేస్తున్నారు.
ఇటీవ‌ల అధికార తెలుగుదేశం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరిన శిల్పా మోహ‌న్ రెడ్డి.. తాజాగా నియోజ‌క‌వ‌ర్గం మీద త‌న ప‌ట్టును మ‌రింత బలోపేతం చేసేందుకు త‌న ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం చేశారు.

నంద్యాల ఉప ఎన్నికలో త‌మ‌పార్టీ అభ్య‌ర్థి విజ‌యం సాధించ‌కుంటే.. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి.. రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని భూమా అఖిల ప్రియ సంచ‌ల‌న వ్యాఖ్య చేయ‌టం తెలిసిందే. దీనికి ప్ర‌తిసవాల్‌ ను విసిరారు జ‌గ‌న్ పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి.

స‌వాల్‌.. ప్ర‌తిస‌వాల్ తోనే ఆగ‌ని ఈ ఇద్ద‌రు నేత‌లు.. త‌మ క్యాడ‌ర్‌ ను మ‌రింత బ‌లోపేతం చేసుకునే దిశ‌గా ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. ఈ వ్య‌వ‌హారంలో శిల్పా తీరు జోరుగా సాగుతోంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీకి చెందిన మాజీ కౌన్సిల‌ర్‌ ను.. భూమా నాగిరెడ్డికి స‌న్నిహితుడైన గోప‌వ‌రం గోపీనాథ‌రెడ్డిని జగ‌న్ పార్టీలో చేర్చారు శిల్పా.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో.. మంత్రి అఖిల‌ప్రియ చేసిన స‌వాల్‌ను శిల్పా మ‌రోసారి గుర్తు చేశారు. అఖిల‌ప్రియ స‌వాల్‌ ను స్వీక‌రిస్తాన‌ని చెప్పిన శిల్పా.. ఉప ఎన్నిక‌ల్లో తాను ప‌రాజ‌యం పాలైతే రాజ‌కీయాల నుంచి శాశ్వితంగా త‌ప్పుకుంటాన‌ని మ‌రోసారి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో చేరిన నేత‌లు మాట్లాడుతూ.. మంత్రి అఖిల‌ప్రియ తీరుతోనే తాము పార్టీ మారిన‌ట్లుగా వెల్ల‌డించారు.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఉప ఎన్నిక‌ల‌కు ముందు అధికార‌పార్టీలోకి నేత‌లు చేర‌టం మామూలే. నంద్యాల‌లో మాత్రం సీన్ కాస్త భిన్నంగా సాగుతోంది. అధికార ప‌క్షానికి చెందిన నేత‌లు ప‌లువురు విప‌క్ష పార్టీలోకి వ‌చ్చి చేర‌టంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. తాజా ప‌రిణామాలు చూస్తే.. నంద్యాల నియోజ‌క‌వ‌ర్గం మీద శిల్పా త‌న ప‌ట్టును అంత‌కంత‌కూ పెంచుకుంటూ వెళుతున్నార‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇది మంత్రి అఖిల‌ప్రియ‌కు నిజంగా చేదువార్తేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/