Begin typing your search above and press return to search.

శిల్పా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న... వైసీపీలో చేరుతా!

By:  Tupaki Desk   |   12 Jun 2017 3:27 PM GMT
శిల్పా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న... వైసీపీలో చేరుతా!
X
తెలుగుదేశం పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ మంత్రి శిల్పా మోహన్‌ రెడ్డి తాను వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైస్‌ జగన్‌ సమక్షంలో ఎల్లుండి బుధ‌వారం వైసీపీలో చేరుతున్నట్లు శిల్పా వెల్లడించారు. ఈరోజు నంద్యాలలో తన ముఖ్య అనుచరులతో శిల్పామోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వైసీపీలో చేరాలని మెజారిటీ కార్య‌క‌ర్త‌లు శిల్పాపై ఒత్తిడి తీసుకువ‌చ్చారు. దీంతో అనంతరం మీడియాతో మాట్లాడిన శిల్పా తాను అధికార తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

సీనియ‌ర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మ‌ర‌ణంతో వ‌చ్చిన నంద్యాల ఉప ఎన్నిక గెలుపు టీడీపీ త‌ర‌ఫున త‌మ కుటుంబం పోటీచేసేలా భూమా త‌న‌య‌ - మంత్రి అఖిల‌ప్రియ స్కెచ్ వేశారు. అయితే ఆమెకు తెలుగుదేశం పార్టీలోనే వ్య‌తిరేక‌త ఎదురైంది. నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నేత‌లైన శిల్పా బ్ర‌ద‌ర్స్ ఉప ఎన్నిక‌ల్లో భూమా కుటంబానికి టికెట్ ఇవ్వ‌డంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ‌ద్ద పంచాయ‌తీ పెట్టుకున్నారు. త‌మ‌కే టికెట్ కేటాయించాల‌ని డిమాండ్ చేశారు. దీంతో ఈ నిర్ణ‌యాన్ని బాబు పెండింగ్‌ లో పెట్టారు. అయితే సుదీర్ఘ‌కాలంగా ఈ నిర్ణ‌యం పెండింగ్‌ లో ఉండ‌టం, అఖిల‌ప్రియ వైపే మొగ్గుతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో కార్య‌క‌ర్త‌లు శిల్పాపై ఒత్తిడి చేయ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

కాగా, అధికార తెలుగుదేశం పార్టీని వీడి విప‌క్ష వైసీపీలో సీనియ‌ర్ నేత చేర‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మ‌లుపున‌కు బీజం వేసే అంశంగా విశ్లేష‌కులు చెప్తున్నారు. ఈ ప‌రిణామం టీడీపీకి గ‌ట్టి ఎదురుదెబ్బ అని భావిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/