Begin typing your search above and press return to search.

శిల్పాను క్రాస్‌ రోడ్స్‌ లో నిల‌బెట్టిన బాబు

By:  Tupaki Desk   |   15 April 2017 8:01 AM GMT
శిల్పాను క్రాస్‌ రోడ్స్‌ లో నిల‌బెట్టిన బాబు
X
తెలుగుదేశం పార్టీలో అంత‌ర్గ‌త రాజ‌కీయాలు మ‌లుపులు తిరుగుతున్నాయ‌ని అంటున్నారు. పార్టీ సీనియ‌ర్ నేత భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో వ‌చ్చిప‌డిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్య‌ర్థి విష‌యంలో పార్టీలోని లుక‌లుక‌లు తారాస్థాయికి చేరాయ‌ని చెప్తున్నారు. ఈ టికెట్‌ ను సంపాదించుకునేందుకు ఇప్ప‌టికే నాలుగు వేర్వేరు గ్రూపులు బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అంద‌రికంటే ప్ర‌తిష్టాత్మ‌కంగా పార్టీ సీనియ‌ర్ నేత శిల్పా మోహన్‌ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారు. టికెట్ ద‌క్క‌క‌పోతే పార్టీ వీడ‌ట‌మే కాకుండా సొంతంగా బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు స‌న్నిహితుల‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు శిల్పాను ఇప్పుడు క్రాస్ రోడ్స్ లో నిల‌బెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీలోని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో పోటీ ప‌డేందుకు భూమా కుటుంబ సభ్యులకే ఆ టిక్కెట్‌ కేటాయించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుని, పార్టీ నేతలకు తెలిపారని సమాచారం. ఈ విషయాన్ని అక్కడ ఉప ఎన్నికలో పార్టీ టికెట్‌ ను ఆశిస్తున్న శిల్పా మోహన్‌ రెడ్డితో కూడా చంద్రబాబు స్పష్టం చేశారని తెలిసింది. దీంతో శిల్పా మోహన్‌ రెడ్డి అమరావతిలో చంద్రబాబుతో సమావేశమయ్యారని, భూమా కుటుంబ సభ్యులకే టికెట్‌ ఇవ్వనున్నట్లు బాబు స్పష్టం చేయ‌డంతో ఖంగు తిన్నారని స‌ద‌రు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పార్టీ టిక్కెట్‌ తో పోటీ చేసే అభ్యర్థిని గెలిపించేందుకు పని చేయాలని మోహన్‌ రెడ్డికి బాబు స్ప‌ష్టంగా ఆదేశించార‌ని తెలుస్తోంది. పార్టీ టికెట్‌ దక్కకపోతే తాను పార్టీ వీడతానని ఇప్పటికే ప్రకటించిన శిల్పా మోహన్‌ రెడ్డి తనకే టికెట్‌ ఇవ్వాలని పట్టుబట్టినప్ప‌టికీ ఫ‌లితం లేద‌ని స‌మాచారం.

ఉప ఎన్నిక‌ల్లో టికెట్ విష‌యంలో పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్ప‌డంతో శిల్పా చివ‌రి ప్ర‌య‌త్నంలో ఉన్న‌ట్లు స‌మాచారం. గత ఎన్నికల్లో తాను టీడీపీ తరఫున పోటీ చేసి నష్టపోయానని, ఇప్పుడు అవకాశం ఇవ్వాలని శిల్పా చంద్రబాబును ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్ర‌య‌త్నం ఫ‌లించే అవ‌కాశం త‌క్కువేన‌ని టీడీపీ వ‌ర్గాలు అంటున్నాయి. దీంతో ఉప ఎన్నికలో టికెట్‌ ను ఆశించి త‌న స‌త్తా చాటుకోవాల‌ని భావించిన శిల్పా ఇప్పుడు అయోమ‌యంలో ప‌డ్డార‌ని స‌మాచారం. టికెట్ ద‌క్క‌క‌పోయినా పార్టీలోనే ఉండాలా? లేదంటే స‌్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేయాలా? మ‌రో పార్టీలోకి జంప్ చేసి టికెట్ సంపాదించాలా? అంటూ ఏదీ తేల్చుకోలేని స్థితిలో శిల్పా ప‌డిపోయార‌ని టాక్ వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/