Begin typing your search above and press return to search.

సెంటిమెంట్ కంటే అనుభ‌వ‌మే అక్క‌డ‌ కీ!

By:  Tupaki Desk   |   14 Aug 2017 10:44 AM GMT
సెంటిమెంట్ కంటే అనుభ‌వ‌మే అక్క‌డ‌ కీ!
X
మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు, ఇతర కీల‌క‌ నాయ‌కులంతా ఒక‌వైపు నంద్యాల ఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందు కు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌రుస మీటింగులు పెడుతున్నారు. ప్ర‌లోభాల‌కు గురిచేస్తున్నారు. గెలుపు కోసం టీడీపీ నాయ‌కులు సామదాన‌బేధ‌దండోపాయాలన్నీ ప్ర‌యోగిస్తున్నారు. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా విజ‌యం త‌న‌దేన‌ని వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న‌రెడ్డి బ‌ల్ల‌గుద్దిమ‌రీ చెబుతున్నారు. మ‌రి ఆయ‌న‌కున్న న‌మ్మ‌కం ఏంటి? అంటే అనుభ‌వం, అనుబంధం. ఈ రెండూ త‌న‌కు విజ‌యాన్ని అంద‌జేస్తాయ‌ని ఆయ‌న బ‌లంగా న‌మ్ముతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న‌ స‌మ‌యంలో చేసన అభివృద్ధి, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌తో ఉన్న సాన్నిహిత్యం ఆయ‌న‌కు ప్ల‌స్‌గా మారుతున్నాయి.

2004 కంటే ముందు నుంచే శిల్పా మోహన్ రెడ్డికి నంద్యాలతో అనుబంధం ఉంది. 2004లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీచేసిన‌ ఆయ‌న.. టీడీపీ అభ్యర్తి ఫరూక్ పై యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థి భాస్కర్ పై 32 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన శిల్పా.. వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి చేతిలో మూడు వేల ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అతి స్వ‌ల్ప తేడాతో ప‌రాజయం పొందారు. అయితే ఈసారి అలా ఉండ‌దని స్ప‌ష్టంచేస్తున్నారు శిల్పా!

దాదాపు పదమూడేళ్ల నుంచి నంద్యాల ప్రజలతో ఉన్న అనుబంధం తనను గెలిపిస్తుందని శిల్పామోహన్ రెడ్డి బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు. భూమా కుటుంబం కంటే నంద్యాలతో తనకే ఎక్కువ అనుబంధం, సంబంధం ఉందని శిల్పా గుర్తు చేస్తున్నారు. కేవ‌లం భూమా ఫ్యామిలీపై ఉన్న సెంటిమెంట్ ప్ర‌ధాన అస్త్రంగా టీడీపీ నంద్యాల ఉప ఎన్నిక‌ బ‌రిలోకి దిగింద‌న్న విష‌యం తెలిసిందే! అయితే సెంటిమెంట్ కంటే అనుబంధానికే నంద్యాల ప్రజలు ఎక్కువ మొగ్గు చూపుతారంటున్నారు శిల్పా సోదరులు.