Begin typing your search above and press return to search.

నంద్యాల‌ను జ‌గ‌న్‌ కు బ‌హుమ‌తిగా ఇస్తాంఃశిల్పా

By:  Tupaki Desk   |   2 Aug 2017 1:45 PM GMT
నంద్యాల‌ను జ‌గ‌న్‌ కు బ‌హుమ‌తిగా ఇస్తాంఃశిల్పా
X
ఎమ్మెల్సీ శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతుండ‌టం ప‌ట్ల నంద్యాల వైసీపీ అభ్యర్ది శిల్పా మోహన్ రెడ్డి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న సోదరుడు త‌న‌తో పని చేసేందుకు వైసీపీలోకి రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నంద్యాల‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ``నేను మైనారిటీలకు ఎంచేశానో, ఎలా చేశానో మైనారిటీ సోదరులకు తెలుసు...నాకు తెలుసు. నంద్యాల‌లో ఓటర్లను ఎన్ని ప్రలోభాలు పెట్టిన గెలుపు వైసీపీదే`` అని ధీమా వ్యక్తం చేశారు.

తాము టీడీపీలో ఉన్నపుడు భూమా వర్గీయులు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చెప్పలేమని శిల్పా మోహ‌న్ రెడ్డి అన్నారు. నంద్యాల అభివృద్ది కోసం గతంలో సీఎం చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం ఇస్తే...``డబ్బులు ఎక్కడ ఉన్నాయి? మీరు అడిగిందల్లా చేయాలంటే కుదరని పని. మీదగ్గర డబ్బులు ఉంటే ఇవ్వండి...అని తిట్టిన చంద్రబాబు ఇప్పుడు నంద్యాల మీద దొంగ ప్రేమ చూపిస్తున్నారు`` అని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తనను తీవ్రంగా అవమానపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి రాజీనామా చేశాన‌ని పేర్కొంటూ పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా తన రాజీనామా లేఖను పంపానని ఆయన తెలిపారు . ‘రేపు నంద్యాల బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతా. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కోసం కృషి చేశాను. అలాగే రెండేళ్లుగా టీడీపీ బలోపేతం కోసం తీవ్రంగా శ్రమించా. గతంలొ దివంగత నేత వైఎస్ఆర్ హయంలొ పనిచేసా. జగన్మోహన్ రెడ్డి గారి వద్ద నిబద్దత‌తో పనిచేసిన అనుభవం నాకు ఉంది` అని అన్నారు.

పదవుల కోసం పార్టీ మారిన మంత్రి అఖిలప్రియ సహా టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌రంగా ఉంద‌ని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి అన్నారు. ``వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదు.అందరి బండారం ముందుముందు బ‌యట పెడతా. చీమకు కూడా హాని చేయని వ్యక్తి మా సోదరుడు. ఆయన మీద విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం`` అని శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ``డబ్బులకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు కూడా మామీద విమర్శలు చేస్తున్నారు. రాజీనామాను జేబులో పెట్టుకుని తిరుగుతున్నా. దమ్ముంటే రండి అందరం రాజీనామా చేద్దాం. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా మేమేంటో చూపిస్తాం. నంద్యాల గెలుపును జగన్ కు బహుమతిగా ఇస్తాం’ అని శిల్పా స‌వాల్ విసిరారు. శిల్పా బ్రదర్స్ ఆద్వర్యంలొ జిల్లాలో వైసీపీ పార్టీ జెండా ఎగురవేస్తామని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు బొత్సా సత్యనారాయణ, కర్నూలు జిల్లా వైసీపీ సీనియర్ నాయకలు గౌరు వెంకటరెడ్డి ,శ్రీశైలం నియోజకవర్గ కార్యకర్తలు ,చ‌క్రపాణ‌రెడ్డి అనుచరులు పాల్గొన్నారు.