Begin typing your search above and press return to search.

నంద్యాల‌లో గెలుపు నాదే: శిల్పా మోహ‌న్ రెడ్డి

By:  Tupaki Desk   |   29 July 2017 10:21 AM GMT
నంద్యాల‌లో గెలుపు నాదే: శిల్పా మోహ‌న్ రెడ్డి
X
ఉప ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌డంతో నంద్యాల‌లో రాజ‌కీయ వేడి రాజుకుంది. అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేశాయి. చంద్ర‌బాబు పై నంద్యాల నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ఎన్ని కుట్రలు చేసినా త‌న గెలుపు ఖాయ‌మ‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు. టీడీపీ త‌న అధికార బ‌లాన్ని ఉప‌యోగించి డ‌బ్బును వెద‌జ‌ల్లుతోంద‌ని అన్నారు. నంద్యాలలో ఉప ఎన్నిక ప్ర‌చారాన్నిశిల్పా మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం ప్రచారం ప్రారంభించారు.

ఎన్నిక‌లు రాగానే టీడీపీకి నంద్యాల మీద ఎక్క‌డ లేని ప్రేమ పుట్టుకువ‌చ్చింద‌ని శిల్పా మోహ‌న్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్ర‌తి రోజు 7-8 మంది మంత్రులు ఇక్క‌డే మ‌కాం వేస్తున్నార‌ని, నంద్యాల ఇన్ చార్జ్ లుగా ఏకంగా 24 మంది ఎమ్మెల్యేలను టీడీపీ నియ‌మించింద‌ని చెప్పారు.

‘టీడీపీ నేతలకు ఏ వీధి ఎక్కడుందో తెలియదు. ఎన్నికలు రాగానే వాళ్లకు నంద్యాల గుర్తొచ్చింది. గ‌తంలో సమస్యలు ప‌రిష్క‌రించాల‌ని ఎన్నిసార్లు చంద్రబాబును కోరినా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు రాగానే ఏదో చేస్తామని చెప్తున్నారు. ఇన్ని రోజులు నంద్యాలను ఎందుకు పట్టించుకోలేదు?’ అని శిల్పా మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు.

టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా నేను గెలవడం ఖాయమ‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఓట‌ర్ల‌ను ర‌క‌ర‌కాలుగా మ‌భ్య‌పెట్టేందుకు, భ‌య‌పెట్టేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని చెప్పారు. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌మ‌కే ఉంద‌ని, వైసీపీకి నంద్యాల ఓట‌ర్లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని అన్నారు. న‌వ‌ర‌త్నాల‌కు ప్ర‌జ‌ల నుంచి విశేష స్పంద‌న ల‌భిస్తోంద‌ని, ఆ ప‌థకాల గురించి మ‌రింత ప్ర‌చారం చేస్తామ‌ని అన్నారు. ఆగ‌స్టు 4 వ తేదీన నామినేష‌న్ వేయ‌బోతున్నాన‌ని ఆయ‌న చెప్పారు. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైన సంగ‌తి తెలిసిందే. ఆగస్టు 23న పోలింగ్‌, 28న కౌంటింగ్‌ జరగనుంది.