Begin typing your search above and press return to search.

శిల్పా చౌదరి కేసు: సిగ్నేచర్ విల్లా కేంద్రంగా దందా? 200 కోట్ల వసూళ్లు

By:  Tupaki Desk   |   10 Dec 2021 7:38 AM GMT
శిల్పా చౌదరి కేసు: సిగ్నేచర్ విల్లా కేంద్రంగా దందా? 200 కోట్ల వసూళ్లు
X
అధికవడ్డీల ఆశచూపించి ప్రముఖుల నుంచి కోట్లాది రూపాయలు మోసం చేసిన కేసులో శిల్పా చౌదరికి ఉప్పర్ పల్లి కోర్టు మరో మూడు రోజుల కస్టడీ ఇచ్చింది.

దర్యాప్తులో భాగంగా పోలీసులు సంచలన నిజాలను శిల్పా చౌదరి నుంచి రాబడుతున్నట్టు సమాచారం. శుక్రవారం నుంచి ఆదివారం వరకూ నార్సింగి ఎస్.వో.టి కార్యాలయంలో మహిళా పోలీసు అధికారుల సమక్షంలో ఆమెను విచారించనున్నారు. శిల్పా చౌదరి దంపతులపై నార్సింగి ఠాణాలో 7 కేసులు నమోదయ్యాయి. రూ.12 కోట్లు మోసపోయినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నవిషయం తెలిసిందే.

భర్త కృష్ణ శ్రీనివాస్ ప్రసాద్ తో కలిసి శిల్పాచౌదరి 3 ఏళ్లుగా ప్రముఖుల నుంచి భారీ మొత్తంలో డబ్బు తీసుకొని ఇతరులకు వడ్డీలకు ఇచ్చినట్టు సమాచారం. మొదట్లో రుణాలిచ్చిన వారికి వడ్డీలు సక్రమంగానే చెల్లించినా 6 నెలలుగా ఆమె నుంచి డబ్బు తీసుకున్న వ్యక్తులు ముఖం చాటేయడంతో వడ్డీల చెల్లింపు వ్యవహారం బెడిసికొట్టింది.

శిల్పా చౌదరి అనధికార అంచనా ప్రకారం రూ.200 కోట్ల వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖులు, సంపన్న కుటుంబాలకు చెందిన మహిళలు నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చేందుకు ఆమెకు అప్పుగా ఇచ్చినట్టు సమాచారం. ఆ ధనాన్ని ఆమె అమెరికాలోని కొందరు బినామీలకు చేరవేసినట్లు తెలిసింది.

నగర శివార్లలో నిర్మించతలపెట్టిన ఆసుపత్రికి రూ.50 కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. 6 నెలల క్రితం వరకూ ప్రతినెలా రూ.50 లక్షలు వడ్డీలు చెల్లించినట్లు తెలిసింది. గత విచారణలో తాను ఇద్దరికీ పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్టు శిల్పా చౌదరి చెప్పింది. వారిలో ఒకరు శంకరంపల్లికి చెందిన రాధిక అని ఆమెకు 6 కోట్లు ఇచ్చానంటూ వెల్లడించింది.