Begin typing your search above and press return to search.

నామినేష‌న్లు వేయండి... ష‌ర్మిల పిలుపు..!

By:  Tupaki Desk   |   8 Sept 2021 1:37 PM IST
నామినేష‌న్లు వేయండి... ష‌ర్మిల పిలుపు..!
X
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు సంబంధించి త‌మ వ్యూహం గురించి మ‌రోసారి స్పందించారు వైఎస్ఆర్టీపీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌. హుజూరాబాద్ బై పోల్ లో వీలైనంత‌గా నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. పాల‌మూరు వ‌ర్సిటీ ఎదుట నిరుద్యోగుల‌తో క‌లిసి ఆమె ధీక్ష‌ను చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె హుజూరాబాద్ బై పోల్ గురించి మాట్లాడారు. నిరుద్యోగులంతా ఆ ఉప ఎన్నిక‌లో నామినేష‌న్లు వేసి, నిర‌స‌న‌కు ఆ మార్గాన్ని ఎంచుకోవాల‌ని అన్నారు. నామినేష‌న్ల‌ను వేసే నిరుద్యోగుల‌కు త‌మ పార్టీ అండ‌గా నిలుస్తుంద‌ని ఆమె ప్ర‌క‌టించారు.

హుజూరాబాద్ లో వైఎస్ఆర్టీపీ పోటీ చేసే అవ‌కాశాలు లేవ‌ని ఇది వ‌ర‌కే స్ప‌ష్ట‌త వచ్చింది. అయితే అక్క‌డ నిరుద్యోగుల‌తో నామినేష‌న్ల‌ను వేయించే ఆలోచ‌న ఆ పార్టీకి ఉన్న‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. ష‌ర్మిల ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించేశారు. హుజూరాబాద్ లో తాము అనుస‌రించ‌బోయే వ్యూహాన్ని తెలిపారు.

అలాగే ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ ఫ‌స్ట్ ఫ్యామిలీపై కూడా ఆమె ధ్వ‌జ‌మెత్తారు. తాలిబ‌న్ల చేతిలో ఆఫ్గానిస్తాన్ బంధీ అయిన‌ట్టుగా.. తెలంగాణ మొత్తం క‌ల్వకుంట్ల ఫ్యామిలీ చేతిలో బంధీ అయిపోయింద‌ని ఆమె వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాల‌న‌లో నిరుద్యోగిత పెరిగిపోయింద‌ని, వ్య‌వ‌సాయ‌దారులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌ని.. ఇలాంటి ప‌రిస్థితుల్లో నిరుద్యోగులు గొర్రెలు పెంచుకోవాల‌ని చెబుతుంటే, మ‌రో మంత్రి బ‌ర్రెలు పెంచుకోవాల‌ని, హ‌మాలీ ప‌ని చేయాల‌ని సూచిస్తున్నాడంటూ ఆమె ధ్వ‌జ‌మెత్తారు. వైఎస్ఆర్ హాయంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేద‌ని, ఆయ‌న‌ను ఒక తెలంగాణ మంత్రి విమ‌ర్శించ‌డం ఏమిట‌ని ఆమె ప్ర‌శ్నించారు.