Begin typing your search above and press return to search.

షారుక్ కొడుకు డ్రగ్స్ పార్టీ భగ్నం చేసిన అధికారి ఎవరు?

By:  Tupaki Desk   |   4 Oct 2021 4:03 AM GMT
షారుక్ కొడుకు డ్రగ్స్ పార్టీ భగ్నం చేసిన అధికారి ఎవరు?
X
అన్నిఆదివారాలు ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని తాజా ఆదివారం స్పష్టం చేసింది. గాంధీ జయంతి పక్కరోజున ఆదివారం కావటం.. బ్యాక్ టు బ్యాక్ సెలవుల వేళ.. కాస్త బద్ధంగా ఉన్న ప్రజలకు దిమ్మ తిరిగిపోయేలా.. ఒక్కసారి ఉలిక్కిపడే ఉదంతాలు చోటు చేసుకున్నాయి.

ముంబయి నుంచి గోవాకు ప్రయాణమైన క్రూయిజ్ పై అధికారులు దాడులు జరపటం.. పెద్ద ఎత్తున డ్రగ్స్ ను గుర్తించటం ఒక ఎత్తు అయితే.. సదరు పార్టీలో బాలీవుడ్ బాద్షా షారుక్ కుమారుడితో పాటు పలువురు బడాబాబుల పిల్లలు ఉండటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

ఇంతకీ ఈ అధికారుల టీంకు లీడ్ చేసిందెవరు? అన్నదిప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. బడా బాబుల పిల్లలు డ్రగ్స్ తో రెచ్చిపోతుంటే.. వారిని అదుపులోకి తీసుకోవటం ద్వారా ఒక్కసారి వెలుగులోకి వచ్చారు ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖెడే. అతగాడి పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అతనికి సంబంధించిన మరిన్నివివరాల్ని తెలుసుకోవటానికి విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది.

40 ఏళ్ల సమీర్ ముంబయిలో పుట్టారు. ఆయన తండ్రి పోలీసు అధికారి. 2004లో సివిల్స్ క్రాక్ చేసిన ఆయన.. ఇండియన్ రెవెన్యూ సర్వీసుకు ఎంపికయ్యారు. తొలుత ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ లో డిప్యూటీ కమిషనర్ గా పని చేశారు. తర్వాతి కాలంలో జాతీయ దర్యాప్తు సంస్థ అదనపు ఎస్పీగా.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించారు. దాదాపు నాలుగేళ్ల క్రితం సమీర్ మరాఠి నటి క్రాంతీ రెద్ కర్ ను పెళ్లాడారు.

క్రమశిక్షణ కలిగిన నిజాయితీపరుడైన అధికారిగా ఆయనకు పేరుంది. బాలీవుడ్ సినిమాల్ని విపరీతంగా ఇష్టపడే అతడు.. విధి నిర్వహణ వరకు వస్తే మాత్రం ఎలాంటి వ్యక్తిగత ఇష్టాలు ఆయన మీద పని చేయమని చెబుతారు. సమీర్ కు భయం అంటే ఏమిటో తెలీదని..ఇప్పటివరకు ఆయన నిర్వర్తించిన విధుల్లో ఏ మాత్రం తేడా రాకుండా చూసుకోగలిగారంటున్నారు.

ఆదాయపన్ను, కస్టమ్స్‌, డ్రగ్స్‌ కేసుల్లో బాలీవుడ్‌ ప్రముఖులకు ముచ్చెమటలు పట్టించారు. ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్‌ డిప్యూటీ కమిషనర్‌గా సేవలందించారు. కస్టమ్స్‌లో ఉన్నప్పుడు సింగర్‌ మిల్కాసింగ్‌ను విదేశీ కరెన్సీతో ముంబై ఎయిర్‌పోర్టులో పట్టుకుంది ఈయనే. ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులను కస్టమ్స్‌ తనిఖీల్లో పట్టుకున్న వైనం గురించి ప్రస్తావిస్తుంటారు.

డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన వేళలో.. పలువురు బడా బాబుల పన్నుఎగవేతల గుట్టు రట్టు చేసినట్లు చెబుతారు. గత ఏడాది (2020) నవంబరు 23న డ్రగ్స్ ముఠా ఒకటి సమీర్ తో పాటు మరో ఐదుగురు ఎన్ సీబీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో ఆయన గాయపడినట్లు చెబుతారు. ఇలా సినిమా హీరోలకు ఉండే లక్షణాలు చాలానే ఆయనలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.