Begin typing your search above and press return to search.

కశ్మీర్ భారత్ దే..ఎట్టకేలకు ఒప్పేసుకున్న పాక్!

By:  Tupaki Desk   |   10 Sept 2019 8:39 PM IST
కశ్మీర్ భారత్ దే..ఎట్టకేలకు ఒప్పేసుకున్న పాక్!
X
జమ్మూ కశ్మీర్ విషయంలో దాయాదీ దేశం పాకిస్థాన్ ఇంతకాలం అనుసరిస్తున్న వైఖరి తప్పేనట. ఇదేదో పాక్ అంటే గిట్టని దేశం చెప్పిన మాట కాదు. స్వయంగా పాకిస్థానే ఈ మాటను ఒప్పేసుకుంది. ఈ మేరకు పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి షా మహ్మద్ ఖురేషీ సంచలన వ్యాఖ్య చేశారు. అంతేనా ఈ మాటను ఖురేసీ... ఏదో క్లోజ్డ్ డోర్ మీటింగుల్లో చెప్పిన మాట కాదు. ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల కౌన్సిల్ సమావేశానికి హాజరైన సందర్భంగా అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఖురేషీ ఈ మాటను చెప్పేశారు.

అయినా భారత్ అంటే నిత్యం విషం కక్కే ఖురేషీ ఈ మాట అన్నారా? అంటే... చాలా మంది నమ్మడానికి సిద్ధంగా లేరనే చెప్పాలి. అయితే పొరపాటునో - లేదంటే ఏమరపాటుగానో ఆయన నోట నుంచి కశ్మీర్ ను భారత రాష్ట్రంగానే ఆయన ప్రకటించేశారు. కశ్మీర్ కు ఏళ్లుగా కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూనే... కశ్మీర్ భారత్ లోని అంతర్భాగమేనని ఆయన ఒప్పేసుకున్నారు. కశ్మీర్ ను ఇండియాలోని ఓ రాష్ట్రంగా (ఇండియన్ స్టేట్ ఆఫ్ జమ్మూ కశ్మీర్) అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా... జమ్మూ కశ్మీర్ విషయంపై పాక్ వాదన ఎప్పటికప్పుడు డొల్లగానే మారిపోయిన వైనం మనకు తెలిసిందే. కశ్మీర్ తమదేనని నిత్యం చెప్పుకునే పాక్ వాదనను భారత్ కూడా ఎప్పటికప్పుడు అంతర్జాతీయ వేదికల మీద తిప్పికొడుతూనే ఉంది. మొన్నటికి మొన్న ఆర్టికల్ 370 రద్దు సమయంలోనూ భారత్ చేసిన వాదనతో ఇతర దేశాలేవీ పాక్ కు మద్దతు తెలపలేదు. ఆ ఎఫెక్టో, ఏమో తెలియదు గానీ... కశ్మీర్ ను ఇండియన్ స్టేట్ గానే పరిగణిస్తున్నట్లుగా ఖురేషీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం నిజంగానే గమనార్హం.