Begin typing your search above and press return to search.

నవంబర్‌ 10న దావూద్ ఆస్తుల వేలం !

By:  Tupaki Desk   |   21 Oct 2020 5:15 PM GMT
నవంబర్‌ 10న దావూద్ ఆస్తుల వేలం !
X
భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, అంతర్జాతీయ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంకు చెందిన ఆస్తులను వేలం వేయడానికి రంగం సిద్ధం చేశారు. స్మగ్లర్స్ అండ్ ఫారిన్ ఎక్సేంజ్ మానిప్యులేటర్స్ యాక్ట్ ప్రకారం....మహరాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలోని దావూద్ ఇబ్రహీంకు చెందిన ఏడు ఆస్తులని నవంబర్ 10న వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

అయితే , ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఈ ఆస్తుల వేలం ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా,ఆస్తుల వేల్యువేషన్ ప్రక్రియ గతేడాదే ముగిసిన సంగతి తెలిసిందే. రత్నగిరి జిల్లా ఖేడ్ తాలుకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు నివాసం ఉండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ కు స్థిరాస్తులు ఉన్నాయి. ఖేడ్లోని విలువైన ఆస్తులు దావుద్ సోదరి హసినా పార్కర్ పేరు మీద, మిగిలినవి తల్లి అమినా పేరు మీద ఉన్నాయి.

1980లలో ఇక్కడ ఉన్న బంగ్లాలోనే దావూద్ కుటుంబసభ్యులు ఉండేవారు. దీనిని దావూద్ ఎంతో విలాసవంతంగా తీర్చిదిద్ది తన తల్లి పేరు మీద ఆస్తి రాయించాడు. 1993 ముంబయి పేలుళ్ల అనంతరం దీనిని దావుద్ కుటుంబసభ్యులు ఆ బంగ్లా విడిచి పెట్టి వెళ్లారు. అది అప్పటినుండి ఖాళీగానే ఉంది. ప్రస్తుతం పూర్తిగా శిధిలా వ్యవస్థకి చేరింది. తాజాగా ఆదివారం ముంబ్కే గ్రామంలో పర్యటించిన అధికారులు.. దావూద్ ఆస్తులపై సర్వే నిర్వహించారు. మొత్తం 7 ఆస్తులను వేలం వేయడానికి సన్నద్ధమవుతున్నారు. వీటి విలువ రూ. కోటి వరకు ఉంటుంది అని అంచనా వేశారు.