Begin typing your search above and press return to search.

నిజాం సొమ్ము కేసులో మరో సంచలన ట్విస్ట్.. తప్పుడు పత్రాలు ఇచ్చారంటూ మనవడి ఫిర్యాదు

By:  Tupaki Desk   |   19 Nov 2020 1:10 PM GMT
నిజాం సొమ్ము కేసులో మరో  సంచలన ట్విస్ట్.. తప్పుడు పత్రాలు ఇచ్చారంటూ  మనవడి ఫిర్యాదు
X
బ్రిటన్ బ్యాంకులో ఉన్న సొమ్ము పై నిజాం వారసుల మధ్య రచ్చ జరుగుతోంది. ఆ సొమ్ముపై తమకే హక్కులున్నాయంటూ నిజాం వారసుల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఏడవ నిజాం.. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు నవాబ్ నజఫ్ అలీ ఖాన్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. తమ బంధువులు ఆ సొమ్ము కాజేయడానికి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి, బ్రిటన్ బ్యాంకుకు సమర్పించారని , బ్రిటన్‌ బ్యాంక్‌ లో ఉన్న ఆ డబ్బుపై సర్వ హక్కులూ తనకే ఉన్నాయని చెప్పారు. డబ్బు కోసం తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ముకరమ్ జా, ఆయన మాజీ భార్య ఎస్రా బీర్గెన్ జా, కుమారుడు అజ్మత్ జా, సోదరుడు ముఫఖమ్ జాపై వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గత 70ఏళ్లుగా వివాదంలో ఉన్న ఆ డబ్బు సర్వాధికారాలపై పాకిస్థాన్‌ను తోసి పుచ్చుతూ ఇండియాకే చెందుతాయని గతేడాది కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ప్రిన్స్‌లు ముకర్రంజా, ముఫక్కంజాలతో పాటు వంశీయులందరూ కూర్చొని వాటాల గురించి చర్చిస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రిన్స్‌, వారి సోదరుడు వాటాల పంపిణీపై చర్చలతో పరిష్కరించుకుంటామన్నారు. ఒకవేళ చర్చలతో వాటాల సమస్య పరిష్కారం కాకుంటే కోర్టు ద్వారా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని అన్నారు. బ్రిటన్‌లో ఉన్న 35మిలియన్‌ పౌండ్లను ఇక్కడ నిజాం ఫ్యామిలీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌కు సంబంధించి 120 కుటుంబాల్లో ఎవరి వాటా ఎలా ఉంటుందో నిర్ణయించుకుంటామని ప్రకటించుకున్నారు. అయితే , తాజాగా తప్పుడు పత్రాలు సమర్పించి సొమ్ము కాజేయాలని చూసారని కేసు నమోదు చేసాడు.

లండన్‌ లోని నాట్‌ వెస్ట్‌ బ్యాంక్‌ పీఎల్‌ సీలో ఈ నిధులు ఉన్నాయి. వడ్డీతో కలిపి ఇప్పుడు ఆ సొమ్ము 3.5 కోట్ల పౌండ్లకు చేరింది. అయితే, ఆ డబ్బు తమకే చెందుతుందని భారత్ ప్రభుత్వంతో కలిసి నిజాం వారసులు ప్రిన్స్‌ ముకరమ్ జా, ముఫఖమ్ జా వాదించారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఆ డబ్బు తమదేనని వాదించింది. బ్రిటన్ ‌లోని నాట్‌ వెస్ట్ బ్యాంకులో దశాబ్ధాలుగా మూలుగుతున్న నిజాం సొమ్ముపై.. లండన్ కోర్టు గత ఏడాది అక్టోబరులో తీర్పు వెల్లడించింది. రెండు వారాల విచారణ అనంతరం అక్టోబరు 2, 2019న తీర్పును ప్రకటించింది. బ్రిటన్ బ్యాంకులో ఉన్న 3.5 కోట్ల పౌండ్ల నిజాం వారసులకే చెందుతాయని జస్టిస్ మార్కస్ స్మిత్ స్పష్టం చేశారు. ముకరమ్‌ జాని ఏడవ నిజం వారసుడిగా పేర్కొంటూ 1967 ఫిబ్రవరి 27న భారత ప్రభుత్వం సర్టిఫికెట్‌ను జారీ చేసింది. అది తప్పుడు ధృవపత్రమంటూ నవాబ్ నజఫ్ అలీ ఖాన్ వాదిస్తున్నారు.