Begin typing your search above and press return to search.

సంచలనం సృష్టిస్తున్న ముద్రగడ లేఖ

By:  Tupaki Desk   |   21 Sept 2021 10:02 AM IST
సంచలనం సృష్టిస్తున్న ముద్రగడ లేఖ
X
మాజీ సినీ ఎగ్జిబిటర్, సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ సంచలనంగా మారింది. చాలామందికి ముద్రగడ రాజకీయనేతగానే పరిచయం. కానీ ఒకపుడు ఎగ్జిబిటర్ గా కూడా ఉన్నట్లు ఆయన రాసిన లేఖ ద్వారానే బయటపడింది. ముద్రగడ లేఖ రాసారంటే మామూలుగా రాజకీయాలకు సంబంధించిందే అయ్యుంటుంది. కానీ ఇపుడు రాసిన లేఖ మాత్రం సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించే. అందులోను ప్రధానంగా నటీ, నటులు, టెక్నీషియన్ల పారితోషికాలు గురించే కావటం గమనార్హం.

సినిమి టికెట్లను ఆన్ లైన్లో ప్రభుత్వమే అమ్మే విషయాన్ని టీడీపీతో పాటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక మీడియా బాగా వివాదాస్పదం చేసిన విషయం తెలిసిందే. సినిమా వ్యాపారంతో ప్రభుత్వానికి ఏమి సంబంధం ? ఆన్ లైన్లో టికెట్లు అమ్మటం ఏమిటి ? అంటు టీడీపీ నేతలతో పాటు చంద్రబాబునాయడు మద్దతు మీడియా నానా గోలచేస్తోంది. అసలు ఆన్ లైన్లో టికెట్ల అమ్మమని తామే ప్రభుత్వాన్ని రిక్వెస్టు చేసినట్లు సినీపెద్దలు ప్రకటించిన తర్వాత అందరి నోళ్ళు ఒక్కసారిగా మూతపడిపోయాయి.

తాజాగా ముద్రగడ రాసిన లేఖ మరో సంచలనంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే బ్లాక్ మనీని నియంత్రించాలంటే హీరో, హీరోయిన్లతో పాటు ఇతర నటులు, టెక్నీషియన్లకు నిర్మాతలు ఇచ్చే పారితోషకాలను ప్రభుత్వం ద్వారానే ఇఫ్పించాలని డిమాండ్ చేశారు. సినిమా టికెట్లను అమ్మటానికి ప్రభుత్వం ఏర్పాటుచేయబోయే ఆన్ లైన్ వ్యవస్ధ ద్వారానే రెమ్యునరేషన్ కూడా ఇప్పిస్తే చాలా లాభాలుంటాయన్నారు.

ఇంతకీ ఆయన చెప్పిన లాభాలు ఏమిటంటే తీసుకున్న రెమ్యునరేషన్లో ట్రాన్స్ పరెన్సీ వస్తుందట. దానివల్ల పన్నులు ఎగ్గొట్టడం తగ్గిపోతోందట. పారితోషికం ఇచ్చే విషయంలో నిర్మాతలకు చాలావరకు భారం తగ్గిపోతుందన్నారు. సినీమా నిర్మాణంలో దుబారా ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయని ముద్రగడ సూచించారు. ఇపుడు నిర్మాత దగ్గర నుండి ఎవరెంత రమ్యునరేషన్ తీసుకుంటున్నారనేందుకు లెక్కలు లేవన్నారు.

సినీరంగం అభివృద్ధికి, నిర్మాల బాగుకోరి తాను ప్రభుత్వానికి లేఖ రాసినట్లు చెప్పుకున్నారు. అంటే సినీపరిశ్రమలో రెమ్యునరేషన్ రూపంలో పెరిగిపోతున్న బ్లాక్ మనీని ముద్రగడ ప్రస్తావించినట్లు అర్ధమవుతోంది. రెమ్యునరేషన్ విషయంలో లోపల జరిగేదొకటి పైకి చెప్పేదొకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఎవరు బహిరంగంగా మాట్లాడరు. అందుకనే ఈ విషయం గురించి ముద్రగడ ప్రస్తావించింది. మొత్తంమీద ముద్రగడ లేఖ చూస్తే నిర్మాతలకు మద్దతుగా ఉన్నట్లే అనుకోవాలి. మరి ఈ మాజీ ఎగ్జిబిటర్ లేఖను గనుక ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తే దేశంలో మరో సంచలనం మొదలవుతుందనటంలో సందేహంలేదు.