Begin typing your search above and press return to search.

ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   24 Dec 2020 9:49 AM IST
ఎన్నికల్లో పోటీచేసే విషయంలో సంచలన నిర్ణయం
X
జమ్మూ-కాశ్మీర్ లో జరగబోయే ఎటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని తమ పార్టీ డిసైడ్ చేసుకున్నట్లు పీపుల్స్ డెమక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన ప్రకటన చేశారు. కేంద్రప్రభుత్వం జమ్మూ-కాశ్మీర్ విషయంలో అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరికి నిరసనగానే తమ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ముఫ్తీ తెలిపారు. రాష్ట్రానికి రద్దుచేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు ఎన్నికల్లో పాల్గొనమని ముఫ్తీ స్పష్టంగా ప్రకటించారు.

తొందరలో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే కాదు భవిష్యత్తులో జరిగే ఏ ఎన్నికల్లో కూడా పాల్గొనకూడదని తమ పార్టీ ఏకగ్రీవంగా నిర్ణయించిందన్నారు. సరే ముఫ్తీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి నష్టమో అర్ధం కావటం లేదు. ఎన్నికల్లో పాల్గొనేది లేదంటే పీపుల్స్ డెమక్రటిక్ పార్టీకి నష్టం కానీ నరేంద్రమోడికో లేకపోతే ఇంకేదో పార్టీకో జరిగే నష్టం ఏమీలేదన్న విషయాన్ని బహుశా ముఫ్తీ మరచిపోయారేమో.

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ-కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తికి రద్దవ్వటంతో స్ధానికంగా ఉన్న అన్నీ పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నా ఎన్నికల్లో పాల్టొనేది లేదని పీడీపీ మాత్రమే నిర్ణయించింది. కాబట్టి తొందరలో జరగబోయే ఎన్నికల్లో పీడీపీ తప్ప మిగిలిన అన్నీ పార్టీలతో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పాల్గొంటాయనటంలో సందేహం లేదు. అప్పుడు ఎన్నికలను బహిష్కరించిన పీడీపీ మాత్రమే నష్టపోతుంది. అలా కాకుండా స్ధానికంగా ఉన్న అన్నీ పార్టీలు కలిసి ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడేమన్నా ప్రభావం ఉండచ్చు.

జమ్మూ-కాశ్మీర కు ఆర్టికల్ 370 రద్దు చేయటం ద్వారా స్వయం ప్రతిపత్తిని ఎత్తేయటం అన్నది కేంద్రప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం. ఆర్టికల్ 370 రద్దు చేయటం వల్ల ఈ ప్రాంతంపై కేంద్రప్రభుత్వానికి సంపూర్ణ హక్కులు దఖలు పడటమే కాకుండా పాకిస్ధాన్ నుండి రాష్ట్రంలోకి జరుగుతున్న చొరబాట్లు తగ్గిపోయాయి. ఆర్టికల్ 370 రద్దువల్ల దశబ్దాల పాటు ఇతర రాష్ట్రాలకు లేని ప్రత్యేక సౌకర్యాలన్నీ జమ్మూ-కాశ్మీర్ కోల్పోయిందన్నది వాస్తవం.

ఆర్టికల్ 370 ఉన్నా రద్దయినా అక్కడి ప్రజలకు పెద్దగా లాభనష్టాలు కూడా ఏమీ కనబడలేదు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు విషయంలో మిగిలిన పార్టీల నేతలు కూడా పెద్దగా మాట్లాడటం లేదు. మరలాంటపుడు ఈ విషయంలో ఒక్క ముఫ్తీ మాత్రం ఎందుకింత పట్టుదలగా ఉన్నారో అర్ధం కావటం లేదు.