Begin typing your search above and press return to search.

సీనియర్ జర్నలిస్ట్ మృతి.. సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం

By:  Tupaki Desk   |   5 March 2020 12:15 PM IST
సీనియర్ జర్నలిస్ట్ మృతి.. సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం
X
అనారోగ్యంతో బాధపడుతూ ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) గురువారం కన్నుమూశారు. హైదరాబాద్ విజయ్ నగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సంతాపం ప్రకటించారు. ఆయన జర్నలిజానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. ఆంధ్ర ప్రదేశ్ వాసి అయినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి పొత్తూరి వెంకటేశ్వర రావు నైతిక మద్దతు ఇచ్చారని ఈ సందర్భం గా కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులతో పాటు ప్రముఖ జర్నలిస్టులు సంతాపం ప్రకటించారు. ఆయన సేవలు మరువ లేనివని గుర్తుచేసుకున్నారు.

1934 ఫిబ్రవరి 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొత్తూరు లో జన్మించిన పొత్తూరి.. 1957లో ఆంధ్ర జనతా పత్రిక తో పాత్రికేయ వృత్తిలోకి అడుగుపెట్టారు. పత్రికా రంగంలో ఐదు దశాబ్దాలకు పైగా ఆయన విశేష సేవలు అందించారు. ప్రముఖ పత్రికల్లో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం, 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు పై రాసిన పుస్తకం ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’ కు సహ రచయిత గా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ గా ఆయన విధులు నిర్వర్తించారు. ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్త పత్రికల్లో పని చేశారు. సాహిత్యం, రాజకీయాలపై అనేక రచనలు చేశారు.