Begin typing your search above and press return to search.

అర్థరాత్రి వేళ.. హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ నేతల సీక్రెట్ మీటింగ్

By:  Tupaki Desk   |   4 Dec 2020 10:57 AM IST
అర్థరాత్రి వేళ.. హైదరాబాద్ హోటల్ లో కాంగ్రెస్ నేతల సీక్రెట్ మీటింగ్
X
ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా.. ఇప్పటికి మారని పార్టీ ఏదైనా ఉందటే అది శతాధిక కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి. తెలంగాణలో ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైన వేళ.. ఆ పార్టీ రథసారధి సీటు దక్కించుకోవటం కోసం కాంగ్రెస్ నేతలు పడుతున్న ప్రయాస చూస్తే.. పార్టీ కంటే తమ పదవులే ముఖ్యమన్నట్లుగా వ్యవహరించే తీరు చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. కష్టకాలంలో పార్టీ పరిస్థితి మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యల కంటే.. గ్రూపులుగా విడిపోయి.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవటానికి చేస్తున్న ప్రయత్నాలు.. నడుపుతున్న గూఢపుఠాణీలు చూస్తే.. జాలి కలుగక మానదు.

ఒకప్పుడు తెలంగాణలో తిరుగులేని స్థాయిలో ఉన్న కాంగ్రెస్.. ఈ రోజున ఎలాంటి దుస్థితిలో ఉందన్నది తెలిసిందే. తాజాగా టీపీసీసీ చీఫ్ ను కొత్తవారిని ఎంపిక చేసేందుకు అధినాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తున్నవేళ.. ఆ స్థానాన్ని దక్కించుకోవటం కోసం నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో ఆ పీఠం రేవంత్ రెడ్డికి దక్కకూడదన్న లక్ష్యంగా మరో వర్గం గురువారం రాత్రి హైదరాబాద్ లోని ఒక హోటల్ లో రహస్య భేటీ అయ్యారు.

ఈ భేటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. టీపీసీసీ కార్యనిర్వాహణ అధ్యక్షుడు కుసుమ్ కుమార్.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. జగ్గారెడ్డి.. పోదెం వీరయ్య.. తదితరలు హాజరయ్యారు. పీసీసీ పీఠం కోసం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద యుద్దమే జరుగుతోంది. ఈ పదవి కోసం ఎంపీ రేవంత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఆయనకు ఆ పదవి ఎట్టి పరిస్థితుల్లో దక్కకూడదన్న ప్రయత్నాల్లో సీనియర్లు పావులు కదుపుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుుస్తోంది.