Begin typing your search above and press return to search.

దేశం తగలబడిపోతుంటే.. ఆ ప్రధాని నోట క్రికెట్ మాట

By:  Tupaki Desk   |   3 Jan 2020 11:04 AM IST
దేశం తగలబడిపోతుంటే.. ఆ ప్రధాని నోట క్రికెట్ మాట
X
రోమ్ నగరం తగలబడి పోతుంటే.. అదేమీ పట్టనట్లు నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించిన వైనాన్ని చరిత్ర చదివిన వారెవరూ మరిచిపోరు. దేశ ప్రజల ఆలనా పాలనా చూడాల్సిన చక్రవర్తి.. ముంచుకొస్తున్న సంక్షోభాన్ని పట్టించుకోకుండా తన దారిన తాను వ్యవహరించిన వైనాన్ని చరిత్ర ఎప్పటికి మర్చి పోదు. మనసున్న ప్రజలు ఎవరూ మన్నించరు. ఆధునిక యుగం లోనూ ఇప్పుడు అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది.

న్యూఇయర్ వేళ.. ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలు కార్చిచ్చు కు తగల బడిపోతూ.. తీవ్ర ఆందోళనల్లో ప్రజలు చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. దేశ ప్రజలకు స్థైర్యాన్ని ఇచ్చే చర్యల మీద ఫోకస్ పెట్టాల్సిన ఆ దేశ ప్రధాని అందుకు భిన్నంగా క్రికెట్ ను ప్రమోట్ చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక.. ఆస్ట్రేలియన్లు అయితే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ.. ఆస్ట్రేలియన్లు తీవ్రమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అక్కడి అడవుల్లో కార్చిచ్చు ప్రబలి..భారీ మంటలతో వందలాది ఎకరాల విస్తీర్ణం కాలి బూడిద అవుతోంది. ఇలాంటి వేళ.. ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ మధ్య మూడో టెస్టు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆసీస్ జట్టును కలుసుకున్న ప్రధాని.. జట్టును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల పై ఆస్ట్రేలియన్లు మండిపడుతున్నారు.

దేశం మొత్తం కార్చిచ్చు దహించి వేస్తున్నా.. అగ్నిమాపక సిబ్బంది మాత్రం క్రికెటర్లకు అండగా ఉంటారన్న అభయాన్ని ఇచ్చారు. ఈ మ్యాచ్ ద్వారా ఇరు దేశాల క్రికెటర్లు అత్యుత్తమ ఆట తీరును ప్రదర్శించటం ద్వారా దేశ ప్రజలు ప్రేరణ చెందుతారని వ్యాఖ్యానించారు. ఓపక్క కొంప తగలబడిపోతున్న వేళ.. దాన్ని నివారించే చర్యల మీద కంటే కూడా క్రికెట్ ఆటను ప్రమోట్ చేసేందుకు ప్రధాని పడుతున్న తపనను ఆస్ట్రేలియా ప్రజలు తప్పు పడుతున్నారు. కార్చిచ్చు కారణంగా తాము ఇళ్లు కోల్పోయి.. తినటానికి తిండి లేక దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. అలాంటివేళ క్రికెట్ ఆట చూసి స్పూర్తి పొందాలనటం ఏమిటంటూ దేశ ప్రధాని మారిసన్ మాటలకు తీవ్రంగా మండి పడుతున్నారు. మొత్తానికి మారిసన్ తీరు నీరో చక్రవర్తిని తలపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.