Begin typing your search above and press return to search.

ముఖేష్ అంబానీ ఇంటి వ‌ద్ద స్కార్పియో కేసుః పోలీసు అధికారిని అరెస్టు చేసిన ఎన్ఐఏ!

By:  Tupaki Desk   |   14 March 2021 7:05 AM GMT
ముఖేష్ అంబానీ ఇంటి వ‌ద్ద స్కార్పియో కేసుః పోలీసు అధికారిని అరెస్టు చేసిన ఎన్ఐఏ!
X
రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నివాసం వ‌ద్ద.. పేలుడు ప‌దార్థాల‌తో కూడిన ఓ వాహ‌నం ఉంచ‌డం తీవ్ర క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. అయితే.. ఆ వాహ‌నాన్ని ఎవ‌రు అక్క‌డ పెట్టారు? అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తుండ‌గానే.. ఆ స్కార్పియో వాహ‌నం ఓన‌ర్ మ‌ర‌ణించడం మ‌రింత సంచ‌ల‌నం రేకెత్తించింది.

దీంతో.. ఈ కేసు అటూ ఇటూ తిరిగి జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) వ‌ద్ద‌కు చేరింది. రంగంలోకి దిగిన అధికారులు విచార‌ణ వేగ‌వంతం చేశారు. అయితే.. ఈ కేసులో ముంబై పోలీసు అధికారిని ఎన్ఐఏ అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం. దాదాపు 12 గంట‌ల విచార‌ణ అనంత‌రం పోలీస్ ఆఫీస‌ర్ స‌చిన్ వాజేను అదుపులోకి తీసుకున్నారు.

స‌చిన్ వాజేన‌ను శ‌నివారం అర్ధ‌రాత్రి వ‌ర‌కు విచారించిన‌ త‌ర్వాత పోలీసు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఆయ‌న‌పై 120బీ, 286, 465, 473, 506(2) సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు ఎన్ఐఏ అధికారులు వెల్ల‌డించారు. స్కార్పియో ఓన‌ర్ మ‌న్ సుఖ్ హిరేన్ మృతివెనుక స‌చిన్ వాజే హ‌స్తం ఉంద‌ని మృతుడి భార్య కూడా ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఫిబ్ర‌వ‌రి 26న ముఖేష్ నివాసం ‘యాంటిలియా’ ఎదుట పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు నిలిపి, ఆ వాహనంలో ఒక బ్యాగును కూడా ఉంచారు. అందులో.. ‘ముఖేష్ భయ్యా.. నీతా బాబీ.. ఇదొక ట్రైలర్ మాత్రమే’ అని రాసి ఉంచిన లేఖ‌ను క‌నుగొన్న‌ట్టు సమాచారం. దీంతో.. ఈ కేసును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న పోలీసులు విచార‌ణ కొన‌సాగించారు. చివ‌ర‌కు ఎన్ఐఏ రంగంలోకి దిగి, పోలీసు అధికారినే అరెస్టు చేయ‌డం గ‌మ‌నార్హం.