Begin typing your search above and press return to search.

జనాభా పెంపు కోసం పథకం.. ఎక్కడో కాదు మన దేశంలోనే

By:  Tupaki Desk   |   27 July 2021 5:30 PM GMT
జనాభా పెంపు కోసం పథకం.. ఎక్కడో కాదు మన దేశంలోనే
X
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరూ ఎదుర్కొనే ప్రధాన సమస్య ల్లో ఒకటి జనాభా విస్పోటనం. ఎలాగైనా సరే ప్రపంచ జనాభాను తగ్గించేందుకు అందరూ నడుం కట్టి కష్టపడుతుంటే కేరళలో క్రైస్తవులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జనాభా పెరుగుదల వల్ల వచ్చే అనర్థాలను గురించి తెలియని వారికి వివరించాల్సిన పాస్టర్లే ఇలా జనాభా పెంచడం కోసం కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం తో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. హవ్వా.. ఇదేం చోద్యం అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇలా చేస్తే జనాభా పెరుగుదలను ఎలా ఆపుతామని ప్రశ్నిస్తున్నారు.

జనాభా పెరుగుదల కోసం వారు ప్రవేశ పెట్టిన పథకాన్ని సర్వత్రా తప్పు బడుతున్నారు. జనాభా పెరిగితే సహజ వనరులు పెరుగుతాయా అంటూ అడుగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే కేరళలోని ఓ చర్చి క్రైస్తవుల జనాభాను పెంచేందుకు కొత్తగా ఓ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. కేరళ లో పేరు మోసిన కాథలిక్ చర్చ్ డియోసెస్ కొత్తగా తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని అందరూ విమర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ర్టం లో జనాభా నియంత్రణకు అక్కడి సర్కారు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలుంటే గవర్నమెంటు ఉద్యోగం తీసేస్తామని ప్రకటించగా... ఇక్కడ మాత్రం ఎక్కువ మంది పిల్లలున్న వారికి ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పడం విడ్డూరం.

2000 వ ఏడాది తర్వాత పెళ్లి చేసుకున్న జంటలకు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి నెలకు 500 రూపాయల నుంచి 1500 రూపాయల ఆర్థిక సాయం అందించాలని అక్కడి చర్చి ప్రతినిధులు నిర్ణయించారు. చర్చి ఇయర్ ఆఫ్ ది ఫ్యామిలీ వేడుక ల్లో ఈ ప్రకటన చేయడం విశేషం. కరోనా మహమ్మారి కంగారు తగ్గిన తర్వాత దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారికి ఆగస్టు నెల నుంచి ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

ఇలా ఆర్థిక సాయం చేయడం మంచి విషయమని ఫాదర్ జోసెఫ్ కుట్టియంకల్ పేర్కొన్నారు. కేరళ రాష్ర్టం లో గత కొన్ని ఏళ్లుగా క్రైస్తవుల జనాభా విపరీతంగా తగ్గుతుందని ఆలోచించి చర్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు కేరళ రాష్ర్టంలో క్రైస్తవుల సంఖ్య దేశంలోనే అధికంగా ఉండేది. అలాంటిది రాను రాను ఈ సంఖ్య విపరీతంగా తగ్గతూ వస్తోంది. ప్రస్తుతం రాష్ర్ట జనాభాలో కేవలం 18.38 శాతం మంది మాత్రమే క్రైస్తవులు మిగిలారు. ఇలా తగ్గిపోతున్న జనాభాను నివారించడం కోసం కాథలిక్ చర్చి జనాభా ఎక్కువగా ఉన్న వారికి ప్రోత్సాహకంగా నగదు అందజేయనున్నట్లు ప్రకటించింది.

అలాగే ఈ నిర్ణయంతో పాటు విస్మయం కలిగించే మరో వివాదాస్పద నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. ఎవరైనా క్రైస్తవుల్లో నాలుగో బిడ్డకు జన్మనిస్తే అటువంటి మహిళలకు ఉచితంగా డెలివరీ చేయిస్తామని ఆ చర్చి ప్రతినిధులు ప్రకటించడం గమనార్హం. అలాగే ఎక్కువ మంది పిల్లలున్న క్రైస్తవ కుటుంబాలకు చెందిన విద్యార్థులను తమ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదివిస్తూ... స్కాలర్ షిప్ లు కూడా అందజేస్తామని ప్రకటించారు.