Begin typing your search above and press return to search.

బ్యాంకుల్లో స్కాంల క‌థ‌..గంటకు..రూ.1.6 కోట్లు

By:  Tupaki Desk   |   16 March 2018 4:12 AM GMT
బ్యాంకుల్లో స్కాంల క‌థ‌..గంటకు..రూ.1.6 కోట్లు
X
మోసాలకు చిరునామాగా మారాయి మన బ్యాంకులు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్నైతే అలవోకగా మోసం చేసేస్తున్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి గంటకు చీటింగ్ - ఫోర్జరీలవల్ల బ్యాంకులకు వాటిల్లిన నష్టం ఎంతో తెలుసా?.. రూ.1.6 కోట్లు. అవును.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కలే ఇలా చెబుతున్నాయి. ఆర్బీఐ పేర్కొన్న ఎనిమిది రకాల మోసాల్లో ఒకటైన చీటింగ్-ఫోర్జరీలతోనే బ్యాంకులు 60 శాతం నష్టపోతుండటం గమనార్హం. ఈ నష్టాలు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రుణాలు పొందడం లేదా తప్పుడు ప్రకటనలతో బ్యాంకుల్ని నమ్మించడం వల్ల వస్తున్నాయి.

ఆర్బీఐ వివరాల ప్రకారం 2014-15 - 2015-16 - 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకింగ్ రంగానికి చీటింగ్ - ఫోర్జరీల వల్ల కలిగిన మొత్తం నష్టం రూ.42,266 కోట్లుగా ఉంది. ఇందులో రూ.37,583 కోట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలైతే, రూ.4,683 కోట్లు ప్రైవేట్ రంగ బ్యాంకులవి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌ బీఐ నష్టాలే రూ.5,743 కోట్లు కావడం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2017-18కి సంబంధించి లెక్కలు తేలాల్సి ఉన్నది. మొత్తంగా చూసినైట్లెతే ఈ నష్టాల్లో 89 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులవే. కాగా, వీటికి సంబంధించి 7,505 కేసులు నమోదవగా - 4,702 కేసులు ప్రభుత్వ బ్యాంకుల నుంచి వచ్చినవే. ఇదిలావుంటే బ్యాంకుల్లో జరిగిన మొత్తం మోసాల్లో నష్టం విలువ గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ.70,000 కోట్లుగా నమోదైంది. ఇదంతా రూ.లక్షకుపైగా జరిగిన మోసాల విలువే. రూ.లక్షకు తక్కువగా ఉన్న మోసాలనూ పరిగణనలోకి తీసుకుంటే నష్టాలు మరింతగా పెరుగడం ఖాయం. మరోవైపు బ్యాంకు సిబ్బంది ప్రమేయం లేకుండా ఈ స్థాయిలో మోసాలు జరుగడం అసాధ్యమన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతుండగా - బ్యాంకింగ్ వ్యవస్థలో శిక్షణ వైఫల్యం - విధివిధానాల్లో లోపాల మూలంగానే మోసాలకు ఆస్కారం ఉంటున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

వ‌రుసగా వెలుగుచూస్తున్న బ్యాంకింగ్ మోసాలపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ శివుడు గరళాన్ని మింగినట్లు.. ఆర్బీఐ కూడా అవినీతిని, మోసాలను తుడిచిపెట్టి బ్యాంకింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందన్నారు. ప్రతీ కేసు విచారణ పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో బుధవారం ఉపన్యాసం చేసిన పటేల్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌ బీ) కుంభకోణంపై మౌనాన్ని వీడారు. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు విచారకరమన్న ఆయన ఈ మోసాలు - అక్రమాలు తీవ్రంగా బాధిస్తున్నాయన్నారు. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చెందిన కొందరు ఈ రకమైన అవినీతికర చర్యలకు పాల్పడి దేశ భవిష్యత్తునే ప్రమాదంలో పడేస్తున్నారన్నారు. అయినప్పటికీ దేవుళ్లు-రాక్షసులు అమృతం కోసం సాగర మథనం చేసినప్పుడు వెలువడిన విషాన్ని పరమేశ్వరుడు ఎలాగైతే మింగేశాడో.. అలాగే అక్రమార్కుల నుంచి ఈ దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ ఇప్పుడు నడుం బిగించిందన్నారు. అయితే మోసగాళ్ల భరతం పట్టేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు కావాల్సి ఉందన్నారు.