Begin typing your search above and press return to search.

కరోనా పేరు చెప్పి 85 వేలు దోచేసిన అంబులెన్స్‌ నిర్వాహకులు..!

By:  Tupaki Desk   |   22 Aug 2020 5:00 PM IST
కరోనా పేరు చెప్పి 85 వేలు దోచేసిన అంబులెన్స్‌ నిర్వాహకులు..!
X
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో చేతనైతే ఇతరులకి సహాయం చేయాలి కానీ, వారిని మోసం చేయకూడదు. కానీ, ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా కొందరు కేటుగాళ్లు తమ చేతివాటం చూపిస్తున్నారు. ఓ వ్యక్తి కరోనాతో చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులను మోసంచేసి, అంత్యక్రియలకు అంబులెన్స్‌ నిర్వాహకులు రూ.85 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. బాధితులు సోషల్‌ మీడియా ద్వారా ఈ మోసాన్ని బయటపెట్టారు..మరొకరు ఇలా మోసపోవద్దని కోరారు.

పూర్తి వివరాలు .. కర్నూలు నగరంలోని బి.క్యాంపునకు చెందిన కరణం సాయినాథరావు ఈ నెల 14న తీవ్ర అస్వస్తతకు గురయ్యాడు. అతన్ని ప్రైవేటు అంబులెన్స్‌ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అయితే సాయినాథరావు కరోనాతో చనిపోయాడని బాధితులకు అంబులెన్స్‌ డ్రైవర్, సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని తామే అంత్యక్రియలకు తీసుకెళ్లాల్సి ఉంటుందని, వైరస్‌ వ్యాప్తి చెందకముందే తరలించాలని చెప్పారు. నిరక్షరాస్యులైన మృతుని భార్య.. విదేశాల్లో ఉన్న కుమారునికి ఫోన్‌ చేసి జరిగింది అంతా చెప్పింది. ఆస్ట్రేలియాలోని మెల్‌ బోర్న్‌ లో ఉంటున్న కుమారుడు క్రాంతి కిరణ్‌ అక్కడి నుంచే ఫోన్‌ లో అంబులెన్స్‌ సిబ్బందితో మాట్లాడారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు రూ.85 వేలకు ఒప్పందం చేసుకుని, ఫోన్‌ పే ద్వారా సురేష్‌ బాబు ఖాతాకు జమ చేయగా, తన తల్లి రూ.35 వేలు నగదు చేతికి ఇచ్చింది.

ఇక, సాయినాథ్ ‌రావు మరణ ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబసభ్యులు గురువారం ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌ ఇచ్చిన సర్టిఫికెట్‌ చూసి ఆశ్చర్యపోయారు. సాయినాథ్ ‌రావు కరోనా తో చనిపోలేదని, సీఆర్‌ ఎఫ్ తో చనిపోయాడని డ్యూటీ డాక్టర్‌ రేవతి పేరుతో ధ్రువపత్రం అందించారు. ఆ రిపోర్ట్ ను వాట్సాప్‌ లో కుమారుడు క్రాంతి కిరణ్‌ కు పంపించారు.జరిగిన మోసాన్ని తెలుసుకున్న ఆ యువకుడు ..విషయాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అంబులెన్స్‌ నిర్వాహకులు చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది.