Begin typing your search above and press return to search.

అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు!

By:  Tupaki Desk   |   24 May 2020 4:11 AM GMT
అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు!
X
అధికార పార్టీ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది.. ఏకంగా ఆయనపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఆయనపై కేసు పెట్టింది ఎవరో కాదు.. ఓ ఎంపీపీ.. పైగా మహిళా ప్రజాప్రతినిధి.. అధికార పార్టీ అయినా కూడా పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడం విశేషం.

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనను కించపరిచేలా మాట్లాడారంటూ స్థానిక ఎంపీపీ సుకన్య.. యాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేతోపాటు ఏసీపీ యాదగిరి - సీఐ గురువారెడ్డి పైనా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యాచారం మండలకేంద్రంలో ఫార్మిసిటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి టీఆర్ ఎస్ నేతలందరినీ ఆహ్వానించిన అధికారులు.. స్థానిక ఎంపీపీ అయిన సుకన్యను ఆహ్మానించలేదు. దీంతో కార్యక్రమం వద్దకు వచ్చిన ఎంపీపీ ఎమ్మెల్యేను - అధికారులను నిలదీశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే ఆమెపై చేయి చేసుకున్నారని.. కులం పేరుతో దూషించారని సుకన్య ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకు ఇబ్రహీంపట్నం ఏసీపీ - సీఐ నారాయణ సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎంపీపీ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే - ఏసీపీ - సీఐలపై ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సుకన్య హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.