Begin typing your search above and press return to search.

బీజేపీపై శ‌త్రుఘ్న సిన్హా షాకింగ్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   5 Nov 2017 9:56 PM IST
బీజేపీపై శ‌త్రుఘ్న సిన్హా షాకింగ్ కామెంట్స్‌!
X
త‌మ సొంత‌పార్టీ పైనే విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తూ, త‌మ పార్టీలోని లోపాల‌ను నిష్ప‌క్ష‌పాతంగా ఎత్తిచూపే నేత‌ల‌లో బీజేపీ లోక్‌సభ ఎంపీ, నటుడు శత్రుఘ్న సిన్హా ఒక‌రు. కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లుగా ఉన్న విష‌యాన్ని చెప్ప‌డం ఈ వెట‌ర‌న్ హీరోకు అల‌వాటు. ఎల్ కే అద్వాణీ కి మ‌ద్ద‌తుగా గ‌తంలో కూడా ఈ షార్ట్ గ‌న్....బీజేపీపై, మోదీపై ప‌లు సంద‌ర్భాల్లో విమ‌ర్శ‌లు గుప్పించారు. నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో కూడా మోదీని విమ‌ర్శించారు. తాజాగా, ఈ ఫైర్ బ్రాండ్ మ‌రోసారి సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. పార్టీలో దురహంకారం పెరుగుతోందని మండిప‌డ్డారు. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీ గెలుపొందాలంటే అధినాయ‌క‌త్వం ఒంటెత్తుపోక‌డను విడ‌నాడాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ప్రజలు అంచనాలను అందుకోవ‌డానికి 'వన్ మేన్ షో, టు మేన్ ఆర్మీ` ప‌ద్ధ‌తుల‌కు బీజేపీ స్వస్తి చెప్పాలన్నారు. ప్రస్తుతం బీజేపీ అనుస‌రిస్తున్న విధానాల పట్ల యువకులు, రైతులు, వ్యాపారులు తీవ్ర‌మైన అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఆ ప్ర‌భావం త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికలపై ప‌డుతుంద‌న్నారు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క కాద‌ని శ‌త్రుఘ్న సిన్హా అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ ఎన్నిక‌లు అధికార పార్టీకి సవాలు వంటిద‌న్నారు. ప్రత్యర్థి పార్టీల‌ను తక్కువగా అంచనా వేయడం పొరపాట‌న్నారు. తాను, బీజేపీని వీడుతున్నట్లు వ‌స్తున్న ఊహాగానాల‌పై ఆయ‌న స్పందించారు. బీజేపీని వదిలిపెట్టే ఉద్దేశం త‌న‌కు లేద‌ని, అలా అయితే తాను ఆ పార్టీలో ఎందుకు చేర‌తాన‌ని ప్ర‌శ్నించారు. పార్టీకి సంబంధించిన నిర్ణ‌యాల‌ను కేవ‌లం ఒక‌రో, ఇద్ద‌రో వ్య‌క్తులు తీసుకోవ‌డం స‌రికాద‌ని మోదీ, అమిత్ షాలనుద్దేశించి న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. ఇదే విధానం కొన‌సాగితే రాబోయే సవాళ్లను ఎదుర్కోలేమని, సొంత‌పార్టీ పై స‌ద్విమ‌ర్శ‌లు చేసేందుకు తాను వెనుకాడ‌బోన‌ని స్పష్టం చేశారు. ప‌టేళ్ల ఉద్య‌మాన్ని బీజేపీ స‌రిగ్గా అర్థం చేసుకోలేక‌పోయింద‌ని, అందుకే హార్దిక్ ప‌టేల్ కు బీజేపీ దగ్గరకాలేకపోయిందన్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

సిద్ధాంతపరంగా బీజేపీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న హార్దిక్ పటేల్ తో అధిష్టానం సరైన ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పెద్ద నోట్ల ర‌ద్దు వ‌ల్ల దేశంలో చాలామంది ఉపాధిని కోల్పోయార‌ని, చాలామంది చిరు వ్యాపారులు రోడ్డున ప‌డ్డార‌ని సిన్హా అభిప్రాయ‌ప‌డ్డారు. బీజేపీ ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన జీఎస్టీ విధానం వ‌ల్ల చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌కు చేతినిండా ప‌ని దొరికింద‌ని, సామాన్య ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని అన్నారు. అధికారులు, న్యాయమూర్తులపై ముందస్తు అనుమతి లేకుండా దర్యాప్తు జరపకూడ‌ద‌ని, వారిపై వచ్చే ఆరోపణలపై మీడియా కూడా అనుమ‌తి లేకుండా వార్తలు రాయకూడదంటూ రాజస్థాన్ సర్కార్ బిల్లు ప్ర‌తిపాదించిన సంగ‌తి తెలిసిందే. ఆ బిల్టుపై సిన్హా మండిపడ్డారు. ఆ బిల్లు...రాజ్యాంగం ప్ర‌సాదించిన‌ భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌ను హ‌రించేదిగా ఉంద‌ని ఆయ‌న అన్నారు.