Begin typing your search above and press return to search.

తన స్ధాయిని తానే దిగజార్చేసుకుంటున్నాడా ?

By:  Tupaki Desk   |   19 Nov 2020 10:15 AM IST
తన స్ధాయిని తానే దిగజార్చేసుకుంటున్నాడా ?
X
టీడీపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతి రాజు వ్యవహారం చూస్తుంటే తనని, తన పెద్దల గౌరవాన్ని తానే దిగజార్చేసుకుంటున్నట్లే ఉంది. ప్రత్యర్దిగా మారిన తన అన్న ఆనంద గజపతిరాజు కూతురు, మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ సంచైతా గజతిపతి రాజును అవమానిస్తున్నాని అనుకుంటునే తన తండ్రి, అన్నల గౌరవాన్ని విజయనగరం రోడ్లపైకి స్వయంగా తానే లాగేసిన విషయాన్ని గ్రహించలేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే సంచైతను ఉద్దేశించి అశోక్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ‘సంచైతకు తండ్రి ఎవరో తెలీదు, తాత ఎవరో కూడా తెలీదం’టూ చాలా అసభ్యంగా మాట్లాడారు. తన ఆరోపణలకు సాక్ష్యంగా తాజాగా సంచైత ట్విట్టర్ వేదికగా పోస్టు చేసిన ఫొటోనే అంటు ఎద్దేవా చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే సంచైత తండ్రి ఆనంద గజపతిరాజు, తల్లి ఉమా గజపతి రాజులు చాలా సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆనంద రెండో వివాహం చేసుకున్నారు.

విడాకుల తర్వాత ఉమ కూడా ఢిల్లీకి చెందిన ఆనంద శర్మ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఈ విషయం గజపతి రాజుల కుటుంబంతో పాటు విజయనగరంలో ఉండే వారందరికి తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య తన తల్లి ఉమ పుట్టినరోజు వచ్చింది. అందుకని సంచైత తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతు ఓ ఫోటోను పోస్టు చేసింది ట్విట్టర్లో. ఆ ఫొటోలో ఉమ భర్త ఆనంద శర్మ కూడా ఉన్నారు. తల్లి ఉమకు ఆనంద శర్మ రెండో భర్తే కానీ సంచైతకు తండ్రి కాదన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు.

సంచైతకు తండ్రి ఎవరంటే ఆనంద గజపతిరాజే అని ప్రతి ఒక్కళ్ళు చెబుతారు. మరిలాంటి చిన్న లాజిక్ ను మరచిపోయి అశోక్ మాత్రం సంచైతకు తండ్రి ఎవరో తెలీదు, తాత ఎవరో కూడా తెలీదని చెప్పటమంటే చాలా అసభ్యంగా ఉంది వినటానికే. సంచైత మీద కోపముంటే అది రాజకీయంగా తేల్చుకోవాలి. తాజా కామెంట్లు విన్న వారికి మరి సంచైత తండ్రి ఎవరనే అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేయాల్సింది కూడా తానే అని మరచిపోతున్నారు అశోక్.

సంచైత తండ్రి ఎవరని ఎవరైనా అశోక్ ను అడిగితే ఏమని సమాధానం చెబుతారు ? తన సోదరుడు, తండ్రి వారసత్వాన్ని తనంతట తానుగా రోడ్లపైకి లాగేసిన విషయాన్ని అశోక్ మరచిపోయినట్లున్నారు. నిజానికి అశోక్ అంటే పార్టీలకు అతీతంగా అందరు గౌరవిస్తారు. అలాంటిది తన స్ధాయిని తానే దిగజార్చేసోకవటంతో పాటు వంశ గౌరవాన్ని కూడా అందరి ముందు అల్లరి పాలు చేస్తున్నారు. మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్ గా తనను తీసేసి అన్న కూతురును నియమించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక చివరకు సంచైతపై తన అక్కసంతా తీర్చుకుంటున్నట్లే కనబడుతోంది. ముందు ముందు అశోక్ ఇంకెత దిగజారిపోతారో ఏమో .