Begin typing your search above and press return to search.

తాలిబన్లను వెనుకేసుకొచ్చిన ఆ పార్టీ ఎంపీ..దేశద్రోహం కేసు

By:  Tupaki Desk   |   18 Aug 2021 10:30 AM GMT
తాలిబన్లను వెనుకేసుకొచ్చిన ఆ పార్టీ ఎంపీ..దేశద్రోహం కేసు
X
ఆప్ఘనిస్తాన్‌ ప్రస్తుతం తాలిబన్ల అధీనంలో ఉంది. అమెరికా సైన్యం అక్కడి నుండి వెనుదిరిగిన తర్వాత, అఫ్గాన్ లో తాలిబన్ల రాజ్యం మొదలైంది. దీనితో అక్కడ భయానక పరిస్థితులు మొదలయ్యాయి. మళ్లీ తాము రెండు దశాబ్దాల కిందటి దారుణమైన పరిస్థితులు చవిచూడాల్సి వస్తుందేమో అనే భయంలో అనేక మంది ప్రజలు వేరే దేశాలకు వెళ్లేందుకు ఎయిర్‌ పోర్టుకు పరుగులు తీస్తున్నారు. విమానంపైన కూర్చుని వెళ్లేందుకు కూడా ఆలోచించడం లేదు. అలాంటి తాలిబన్లను మన దేశానికి చెందిన సమాజ్‌వాదీ ఎంపీ షఫీఖర్ రెహమాన్ బార్క్ వెనకేసుకొచ్చారు.

తాలిబాన్లు తమ దేశ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని, ఆఫ్ఘన్ ప్రజలు దాని నాయకత్వంలో స్వేచ్ఛ కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు తాలిబన్ల పోరాటాన్ని భారతదేశ స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. తాలిబన్లకు అనుకూలంగా ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఆయనపై పోలీస్ స్టేషన్‌ లో కేసు నమోదైంది. దేశ ద్రోహం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిపైనా కేసు పెట్టారు పోలీసులు. తాలిబన్ల చర్యలను ప్రోత్సహించేలా ఆ పార్టీ లోక్‌ సభ సభ్యుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతోన్నాయి. ఆ ఎంపీ పేరు- షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్. ఉత్తర ప్రదేశ్‌ లోని సంభాల్ లోక్‌ సభ స్థానానికి ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ తరఫున ఆయన లోక్‌ సభకు ఎన్నికయ్యారు.

తాలిబన్లు ఆక్రమణను షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించారు. ఏకంగా భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు ఒక్కటేనని పేర్కొన్నారు. తాలిబన్లది కూడా ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పుకొచ్చారు. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నార‌ని, ఆ ఉద్దేశంతోనే వారు పోరాడారని షఫిక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ కితాబిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ స్వాతంత్ర్యం అనేది వారి వ్యక్తిగత విషయమని అన్నారు. అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌లో ఎందుకు పరిపాలన చేస్తుందని ప్రశ్నించారు.

తాలిబన్లు అక్కడ ఒక శక్తి అని ఆఫ్ఘన్ ప్రజలు దాని నాయకత్వంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ రెహమాన్ బార్క్ వ్యాఖ్యలను యూపీ డిప్యూటీ సీఎం మౌర్య తప్పుబట్టారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ కు సమాజ్‌వాదీ నాయకులకు ఎలాంటి తేడా లేదని విమర్శించారు. రెండు రోజుల క్రితం తాలిబన్లు కాబూల్‌ లోకి ప్రవేశించి అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వ్యాఖ్యానాలను తప్పు పట్టారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో ఉంటూ తాలిబన్ల దురాక్రమణను భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.

సిగ్గు లేకుండా సమాజ్‌వాది పార్టీ ఎంపీ తాలిబన్లను సమర్థిస్తున్నారని మండిప‌డ్డారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి దురాక్రమణ, మారణ హోమాన్ని సైతం అంగీకరించినట్టే అవుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా షఫిక్ రెహ్మాన్ వ్యాఖ్యలను తప్పు పట్టారు. సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ ను పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తో పోల్చారు. వారిద్దరి మధ్య పెద్ద తేడా కనిపించట్లేదని ధ్వజమెత్తారు. బీజేపీ ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంత ఉపాధ్యక్షుడు రాజేష్ సింఘాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షఫిక్ రెహ్మాన్‌పై పోలీసులు దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు. సంభాల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై 124ఎ (దేశద్రోహం), 153ఎ, 295 ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.