Begin typing your search above and press return to search.

పులి మీద పుట్ర‌..బ్యాంకుల‌ చుట్టూ క‌ష్టాల చ‌ట్రం

By:  Tupaki Desk   |   24 Nov 2016 7:29 AM GMT
పులి మీద పుట్ర‌..బ్యాంకుల‌ చుట్టూ క‌ష్టాల చ‌ట్రం
X
పెద్ద నోట్ల ర‌ద్దు కష్టాలకు ఇంకా తెర‌ప‌డ‌లేదు. ప‌దిహేను రోజులైనా ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌లేదు. ఈలోగానే ఒక‌టో తేదీ వ‌చ్చేస్తోంది. ఒక‌టో తేదీ వ‌స్తోంద‌న‌గానే బ్యాంకుల‌కు కొత్త టెన్ష‌న్ మొద‌లైంది. పెద్ద మొత్తంలో డిస్పాచ్ చేయాల్సిన జీతాలు - పింఛ‌న్ల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెలియ‌క ఆందోళ‌న చెందుతున్నారు. ప్ర‌భుత్వ‌ - ప్ర‌యివేటు ఉద్యోగులంద‌రికీ బ్యాంకుల ద్వారానే జీతాలు ప‌డుతున్నాయి. ఆయా ప్ర‌భుత్వ శాఖ‌లు - ప్ర‌యివేటు సంస్థ‌లు త‌మ ఖాతాల‌కు నిధుల‌ను బ‌ద‌లాయించి అందులోంచి ఉద్యోగుల ఖాతాల‌కు జీతాలు వేస్తారు. వారు ఏటీఎంలు - బ్యాంకుల నుంచి కావాల్సిన మొత్తాలు తీసుకుంటారు. కానీ... ఇప్ప‌టికే న‌గ‌దు సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉండ‌డంతో ఒక‌టో తేదీ నుంచి జీతాలు - పెన్ష‌న్లు తీస‌కునేవారూ పెరుగుతారు. దీంతో బ్యాంకుల్లో మ‌రింత న‌గ‌దు ఉండాలి. అదే ఇప్పుడు బ్యాంకుల‌ను భ‌య‌పెడుతోంది.

నిజానికి ఒక‌టో తేదీకి ఒక‌ట్రెండు రోజుల ముందునుంచే ఇది మొద‌ల‌వుతుంది. కొన్ని ప్ర‌యివేటు సంస్థ‌లు ఒక‌టో తేదీకి ముందే 30 - 29 తేదీల్లోనే జీతాలు వేస్తాయి. అంటే... మ‌రో నాల్రోజుల్లో బ్యాంకుల‌కు ఈ దెబ్బ ప‌డ‌నుంది. అయితే... బ్యాంకులకు ఆందోళన అక్కర్లేదని ఆర్బీఐ భరోసా ఇస్తున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు ఆర్బీఐ చెబుతున్న‌దేదీ స‌జావుగా సాగ‌ని నేప‌థ్యంలో బ్యాంకుల‌కు న‌మ్మ‌కం పోయింది. అందుకే... ఇప్పటికే మూడో వంతు ఏటీఎంల్లో సాఫ్ట్ వేర్ మార్చేశామని - జీతాల తేదీ నాటికి అన్ని ఏటీఎంలు రెడీ చేస్తామని ధీమాగా చెబుతున్నా బ్యాంకులు మాత్రం టెన్ష‌న్ ప‌డుతున్నాయి. 2 రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని చెప్పి.. రెండు వారాలైనా కష్టాలు తీర్చని ఆర్బీఐ.. ఇప్పుడు ఏటీఎంలన్నీ బాగుచేస్తామనడంపై బ్యాంకులు ఏమాత్రం భరోసాగా లేవు. దేశంలో 90 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. ఇలాంటి స‌మ‌యంలో పులి మీద పుట్ర‌లా ఒక‌టో తేదీ వ‌స్తే ఏం చేయాల‌ని బ్యాంకుల‌న్నీ దిగులు చెందుతున్నాయి.

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌నూ ఇదే ఆందోళ‌న వెంటాడుతోంది. ఏపీలో సీఎం చంద్ర‌బాబు ఇప్ప‌టికే దీనిపై స‌మీక్షించారు. బ్యాంకుల‌న్నీ న‌గ‌దు అందుబాటులో ఉంచాలంటూ ఆయ‌న ఒత్తిడి చేస్తున్నారు. ఒకటో తేదీ వస్తోంది.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వాలి. పింఛన్లు చెల్లించాలి.. ఇందుకు అవసరమైన కరెన్సీని అందుబాటులోకి తీసుకువచ్చేలా తక్షణమే చర్యలు చేపట్టండి అంటూ ఆయ‌న బ్యాంకర్లను ఆదేశించారు. దీంతో బ్యాంకు అధికారుల‌కు కంటిమీద కునుకు ప‌ట్ట‌డం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/