Begin typing your search above and press return to search.

కేసీఆర్ క‌ర్రీపాయింట్‌ కు కౌంట‌ర్ ఇచ్చిందిగా?

By:  Tupaki Desk   |   30 Jan 2019 8:25 AM GMT
కేసీఆర్ క‌ర్రీపాయింట్‌ కు కౌంట‌ర్ ఇచ్చిందిగా?
X
మాది అంత పెద్ద పార్టీ.. ఇంత పెద్ద పార్టీ.. నేనంత సీనియ‌ర్ ను.. నాకు మించిన రాజ‌కీయ నేత‌లు ఈ దేశంలో పెద్ద‌గా లేరంటూ బోలెడంత బిల్డ‌ప్ ఇచ్చే తెలుగుదేశం పార్టీలో.. నోరు తెరిచి సుత్తి లేకుండా సూటిగా ప‌ది నిమిషాల పాటు ఏదైనా విష‌యం మీద మాట్లాడే నేత‌లు ఎవ‌రైనా ఉన్నారా? అంటే వెంట‌నే ఎవ‌రి పేరు గుర్తుకు రాని ప‌రిస్థితి. ఈ ఇబ్బందిక‌ర ప‌రిస్థితిని అంతో ఇంతో కొంద‌రుభ‌ర్తీ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాంటి వారిలో ప్ర‌ముఖంగా వినిపించే పేరు సాదినేని యామినీ. త‌న పేరు చివ‌ర‌న శ‌ర్మ అని పెట్టుకునే ఆమె.. తాను ఏమిటి? త‌న బ్యాక్ గ్రౌండ్ ఏమిట‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

ఏపీ టీడీపీ అధికార ప్ర‌తినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆమె.. ఇటీవ‌ల కాలంలో ఆమె చేసిన అత్యుత్సాహపు వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మారాయి. ప‌వ‌న్ ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్య‌లపై ప‌వ‌న్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. అయినప్ప‌టికి వారి ఆగ్ర‌హాన్ని పెద్ద‌గా ప‌ట్టించుకోని యామిని త‌న రూట్ ను తాను ఫాలో అవుతున్నారు. కియో కారును విడుద‌ల చేసిన సంద‌ర్భంగా మాంచి హుషారులో ఉన్న తెలుగు త‌మ్ముళ్ల‌కు త‌గ్గ‌ట్లే యామిని త‌న ప్ర‌త్య‌ర్తుల‌పై కౌంట‌ర్లు వేసే కార్య‌క్ర‌మాన్ని షురూ చేశారు.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్రావాళ్లు క‌ర్రీపాయింట్లు పెట్టుకోవాల‌న్న కేసీఆర్ ఇప్పుడేం అంటారు? అంటూ తెలంగాణ సీఎంకు కౌంట‌ర్ వేసిన ఆమె.. ప్ర‌ధానిమోడీని కూడా వ‌ద‌ల్లేదు. ప్ర‌ధాని మోడీ 96 దేశాలు తిరిగి.. మేకిన్ ఇండియా నినాదంతో సాధించిందేమిటి? అన్నది చెప్పాల‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అనంత‌పురం జిల్లాలో కియో కార్ల కంపెనీ త‌యారీతో స‌రికొత్త చ‌రిత్ర‌ను ఏపీ స‌ర్కారు సృష్టించిన‌ట్లుగా ఆమె చెప్పారు. ఒక ప్రైవేటు సంస్థ పురోగ‌తిని త‌మ ఖాతాలో వేసుకొని మురిసిపోతున్న యామిని లాంటోళ్లు.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి మీద కూడా మాట్లాడితే స‌బ‌బుగా ఉంటుందేమో?