Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు యామినికి ఒక పదవి వచ్చింది!

By:  Tupaki Desk   |   10 Jun 2020 7:10 AM GMT
ఎట్టకేలకు యామినికి ఒక పదవి వచ్చింది!
X
టీడీపీని కాలదన్ని బీజేపీలో చేరిన యువ మహిళా నేత సాధినేని యామినికి ఎట్టకేలకు ఒక పదవి వచ్చింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం యామిని శర్మ సేవలను గుర్తించింది. ఆమె ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత కాశీ విశ్వనాథ స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా మారడం విశేషం. ఈ మేరకు టెంపుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యామినికి పదవిని ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

దక్షిణ భారతదేశంలో కాశీ ఆలయానికి కొత్త అధికారిక ప్రతినిధిగా యామిని వ్యవహరించనున్నారు. ఆలయం ఉన్న పట్టణంలో అందుబాటులో ఉన్న భక్తుల కోసం కార్యక్రమాలు - సౌకర్యాలను విస్తరించడానికి.. సేవా ప్రచారం చేయడానికి యామినికి అధికారాలుంటాయి.

అసెంబ్లీ ఎన్నికల తరువాత, టిడిపిని వదిలి బిజెపిలో చేరిన కొద్దిమంది నాయకులలో యామిని శర్మ కూడా ఉన్నారు. టీడీపీలో ఉండగా.. చంద్రబాబు అండతో చెలరేగిపోయిన ఆమె బీజేపీలో చేరాక.. గత ఏడాది కాలంగా ఆమె మౌనంగా ఉంటున్నారు. పాలిటిక్స్ అస్సలు చురుకుగా ఉండడం లేదు. ఇప్పుడు, బిజెపి నాయకత్వం ఆమెకు కీలకమైన కాశీ ఆలయ పదవితో సత్కరించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు - కర్ణాటక - కేరళ రాష్ట్రాల్లో ఆలయ సమాచార ప్రచారానికి బాధ్యత వహిస్తుంది.

సోషల్ మీడియాలో ఆలయ సీఈఓకు కృతజ్ఞతలు తెలిపిన యామిని, ఆలయం చేపట్టిన హిందూ ధర్మ రక్షణ కార్యక్రమాలను పని చేయడానికి - వ్యాప్తి చేయడానికి ఈ అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై సమాచారం ప్రచారం చేయడానికి ఆమె తన వంతు కృషి చేస్తానని ఆమె అన్నారు.