Begin typing your search above and press return to search.

లండన్‌ లో హైదరాబాదీ ఉసురు తీసింది పాకిస్థానీయేనట!

By:  Tupaki Desk   |   12 May 2019 9:04 AM GMT
లండన్‌ లో హైదరాబాదీ ఉసురు తీసింది పాకిస్థానీయేనట!
X
గత నెలలో లండన్‌ లో దారుణహత్యకు గురైన హైదరాబాదీ నదీముద్దీన్ హమీద్‌ ను హత్య చేసింది అతడి సహచరుడేనట. అతడు మరెవరో కాదు.. పాకిస్థాన్‌ కు చెందిన అఖీబ్ పర్వేజ్(24). థేమ్స్ వ్యాలీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని నీది ఏ దేశమో చెప్పమంటే ససేమిరా అన్నాడట. అతడు నోరు విప్పకపోయినా హమీద్ కుటుంబం మాత్రం అతడు పాకిస్థాన్ వాడేనని చెప్పింది.

నదీముద్దీన్‌ ను చంపేంత ద్వేషం ఎందుకయ్యా నీకు అని పోలీసులు అతడిని ప్రశ్నిస్తే- తన ఉద్యోగం పోవడానికి అతడే కారణమని సెలవిచ్చాడట. నదీమ్ హత్యకు రెండు వారాల ముందే అతడిని ఉద్యోగం నుంచి తొలగించారట. అతడి పనితీరు ఏమంత బాగోకపోవడంతో టెస్కో మాల్‌ మేనేజ్‌మెంట్ అతడిని ఉద్యోగం నుంచి దయచేయమందట. తన ఉద్యోగం పోవడానికి నజీముద్దీన్ ఫిర్యాదులే కారణమని, తనపై లేనిపోనివి చెప్పి ఉద్యోగం నుంచి తీసి వేయించాడని భావించిన అఖీబ్ అప్పటి నుంచే ద్వేషం పెంచుకున్నాడట. సమయం కోసం ఎదురుచూస్తున్న అఖీబ్ గత నెల 8న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మాల్ సెల్లార్ పార్కింగ్ వద్ద నదీముద్దీన్‌ను కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు.

అఖీబ్‌ తో నదీమ్ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని - ఇరు కుటుంబాలు చాలా చక్కగా ఉండేవని నదీమ్ కుటుంబానికి ఆప్తుడైన - న్యాయవాది ఫహీమ్ ఖురేషీ పేర్కొన్నారు. అయితే, అఖీబ్ ఇంత పనిచేస్తాడని మాత్రం ఊహించలేకపోయామని నదీమ్ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శనివారం అతడిని న్యాయస్థానం ఎదుట ప్ర్రవేశపెట్టారు.