Begin typing your search above and press return to search.

అర్థరాత్రివేళ మోడీ ఫోన్ కాల్.. అలా ఎందుకో చెప్పిన విదేశాంగ మంత్రి

By:  Tupaki Desk   |   24 Sep 2022 4:23 AM GMT
అర్థరాత్రివేళ మోడీ ఫోన్ కాల్.. అలా ఎందుకో చెప్పిన విదేశాంగ మంత్రి
X
దేశ ప్రధానిగా ఉంటూ.. కీలక సమయాల్లో వారు వ్యవహరించే తీరుకు సంబంధించిన విషయాలు అప్పటికప్పుడు బయటకు రాకున్నా.. కొన్ని సందర్భాల్లో.. కొన్ని వేదికల మీద ఇలాంటి ఆసక్తికర అంశాలు బయటకు వస్తుంటాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటిచోటు చేసుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్.. న్యూయార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన తనకు ఎదురైన ఒక ఆసక్తికకర ఉదంతాన్ని చెప్పుకొచ్చారు. అందులో ప్రధాని మోడీ నాయకత్వ లక్షణాలతో పాటు.. విషయాల పట్ల ఆయన ఎంత అప్రమత్తంగా ఉంటారన్న విషయాన్ని తెలిపేలా ఉండటం గమనార్హం.

అప్ఘనిస్థాన్ మజర్ ఎ షరీఫ్ లోని భారత కాన్సులేట్ మీద దాడి జరిగిన అర్థరాత్రి సమయాన.. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా తనకు ఫోన్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో జైశంకర్ విదేశాంగ కార్యదర్శిగా వ్యవహరించేవారు. 'అర్థరాత్రి వేళ ప్రధాని మోడీ ఫోన్ చేశారు. మెలుకువగా ఉన్నారా? అని అడిగారు' అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణను ఆయన రివీల్ చేస్తూ.. 'దాడి ఘటనను గురించి చెప్పాను. భారత్ నుంచి సాయం కోసం ప్రయత్నిస్తున్నాం. మరో రెండు.. మూడు గంటల టైం పడుతుంది. పని పూర్తి అయ్యాక పీఎంవోకు సమాచారం ఇస్తాను' అని తాను చెబితే.. అందుకు స్పందించిన మోడీ.. 'అదేం అక్కర్లేదు. నేరుగా నాకే ఫోన్ చేయండి' అని చెప్పారన్నారు.

ప్రధాని మోడీలో అసాధారణ నాయకత్వ లక్షణాలకు ఇదో చిన్న నిదర్శనంగా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. మోడీలోని మరో గుణాన్ని ఆయన ప్రస్తుతించారు. క్లిష్ట సమయాల్లో ఆయన వెంట ఉంటారన్నారు. దివంగత బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా ఉండే వేళలో.. విదేశాంగ కార్యదర్శిగా వ్యవహరించిన జై శంకర్.. అనారోగ్యంతో ఆమె మరణించిన తర్వాత.. అందరి అంచనాలకు బిన్నంగా జై శంకర్ ను విదేశాంగ మంత్రిగా చేయటం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.

ఒక అధికారిని కాస్తా కేంద్ర మంత్రిని చేయటంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరగ్గా.. తన పనితీరుతో మోడీ ఎంపిక ఎంత కరెక్టు అన్న విషయం పలు సందర్భాల్లో ఝూడీ అయ్యిందని చెప్పాలి. ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేసిన సందర్భంలో ఆ దేశం మీద అన్ని దేశాలు పరిమితులు విధించటం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా నుంచి నేరుగా చమురు కొనటాన్ని పలువురు తప్పు పట్టారు.

ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదిక మీద మంత్రి జైశంకర్ ను విదేశీ మీడియా సంస్థలు ప్రశ్న వేయగా.. యూరోపియ్ దేశాలు ఒక రోజు దిగుమతి చేసుకునేంత చమురున తాము నెల కోసం దిగుమతి చేసుకుంటామని చెప్పటం అప్పట్లో సంచలనమే కాదు.. జైశంకర్ సమర్థత ఏ స్థాయిలో ఉంటుందన్న విషయం బయటకు వచ్చింది.ఆయన పని తీరును పలువురు ప్రస్తుతించే వేళలో.. ఆయన మాత్రం ప్రధాని మోడీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.