Begin typing your search above and press return to search.

విదేశీ కంపెనీల‌పై చూపిన ప్రేమ మ‌నోళ్ల‌పై లేదు ఎందుకు మోడీజీ?

By:  Tupaki Desk   |   3 Jun 2021 10:00 PM IST
విదేశీ కంపెనీల‌పై చూపిన ప్రేమ మ‌నోళ్ల‌పై లేదు ఎందుకు మోడీజీ?
X
క‌రోనా క‌ల్లోలం స‌మ‌యంలో ఇంటా బ‌య‌ట ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ ఓ రేంజ్ లో టార్గెట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో కేంద్రం తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలు సైతం వివాదాస్ప‌దంగా మారుతున్నాయ‌ని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో త‌ప్పులు వెతికేవారి వ‌ల్లే ఇలాంటి స‌మ‌స్య‌లు అని ఇంకొంద‌రు వాదిస్త‌న్నారు. ఏదీ ఏమైనా మ‌ళ్లీ అలాంటి చ‌ర్చే ప్ర‌స్తుతం జ‌రుగుతోంది. స్థానికంగా అంటే భారత్‌లో ప్రయోగ పరీక్షలు చేపట్టకుండానే తమ వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వాలని ఫైజర్‌, మోడెర్నా తదితర వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించగా ప్రభుత్వం కీల‌క‌ నిర్ణయం తీసుకుంది. అలాంటి అవ‌కాశమే త‌మ‌కూ ఇవ్వాల‌ని మ‌న దేశ కంపెనీలు కోరుతున్నాయి.

దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం అనే ల‌క్ష్యంలో టీకాల కొరత స‌మ‌స్య‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇబ్బందిని అధిగమించేందుకు విదేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు భారత్‌లో పరీక్షలు అవసరం లేదని కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం పొందిన టీకాలకు దేశంలో బ్రిడ్జ్‌ ట్రయల్స్‌ నిర్వహించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఈ మేరకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నిబంధనల్లో మార్పులు చేసింది. దీంతోపాటుగా ఇండెమ్నిటి విషయంలో ఫైజర్‌, మోడర్నా సంస్థలు చేసుకున్న అభ్యర్థనను అంగీకరించడానికి ఎలాంటి అభ్యంతరంలేదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.

అయితే, ప్ర‌స్తుతం ఇండియాలో ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకాకు చెందిన వ్యాక్సిన్‌ను కొవిషీల్డ్ పేరుతో త‌యారు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ‌రో మూడు కొత్త వ్యాక్సిన్ల ట్ర‌య‌ల్స్‌లోనూ పాలుపంచుకుంటోంది. ఫైజ‌ర్‌, మోడెర్నాలాగే త‌మ‌కు కూడా చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కొవిషీల్డ్ త‌యారు చేస్తున్న అద‌ర్ పూనావాలాకు చెందిన సీరం డిమాండ్ చేస్తోంది. ఇండియన్ వ్యాక్సిన్ అయితే ఏంటి.. విదేశీ అయితే ఏంటి.. అంద‌రికీ ఒకే ర‌క‌మైన ర‌క్షణ క‌ల్పించాల్సిందే అని కేంద్ర ప్ర‌భుత్వాన్ని సీరం డిమాండ్ చేసిన‌ట్లు తెలిసింది. అసలు సీరం ఒక్క‌టే కాదు.. ఒక‌వేళ విదేశీ కంపెనీల‌కు ఆ చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ క‌ల్పిస్తే.. మిగ‌త అన్ని వ్యాక్సిన్ కంపెనీల కూడా క‌ల్పించాల‌ని సీరం వ‌ర్గాలు డిమాండ్ చేశాయని స‌మాచారం.