Begin typing your search above and press return to search.

ప్రజలకి మరింత చేరువ కానున్న ఆర్టీసీ !

By:  Tupaki Desk   |   10 Nov 2021 10:33 AM GMT
ప్రజలకి మరింత చేరువ కానున్న ఆర్టీసీ !
X
క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ బయటపడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఉపాది రంగాలు తిరిగి తెరుచుకున్నాయి. జ‌న‌జీవ‌నం సాధార‌ణంగా మారిపోయింది. హైద‌రాబాద్ న‌గ‌రంలో ర‌ద్దీ పెరిగింది. ఇప్ప‌టికే సిటీ బ‌స్ స‌ర్వీసుల‌ను అందుబాటులో ఉంచిన ఆర్టీసీ, తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెల్లవారు జాము 4 గంట‌ల నుంచే ఆర్టీసీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌, నాంప‌ల్లి, కాచిగూడ రైల్వే స్టేష‌న్ల‌తో పాటుగా, ఎంజీబీఎస్‌, జేబీఎస్ లలో కూడా తెల్ల‌వారుజామున 4 గంట‌ల నుంచే సిటీ బ‌స్సుల‌ను అందుబాటులో ఉంచాల‌ని నిర్ణయించింది.

ఈ ప్రాంతాల నుంచి న‌గ‌రంలోని అన్ని ప్రాంతాల‌కు ఉద‌యం 4 గంట‌ల నుంచి బ‌స్సులు బ‌య‌లుదేర‌నున్నాయి. క‌రోనాకు ముందు ఉన్న‌ట్టుగానే ఉద‌యం 4 గంట‌ల నుంచే అన్ని బ‌స్సులు అందుబాటులో ఉంటాయ‌ని తెలంగాణ ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. ఇక విద్యావ్య‌వ‌స్థ‌లు పూర్తిస్థాయిలో తెరుచుకోవ‌డంతో విద్యార్థుల‌కు కోసం కోఠీ, హ‌య‌త్‌ న‌గ‌ర్ మ‌ధ్య అద‌నంగా మ‌రో 12 సర్వీసుల‌ను న‌డుపుతున్న‌ట్టు ఆర్టీసీ అధికారులు తెలియ‌జేశారు.

ఇక ఇదిలా ఉంటే .. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా రాపిడో బైక్ ట్యాక్సీ యాడ్ లో నటించారు. ఈ యాడ్ కారణంగా ఇప్పుడాయన చిక్కుల్లో పడ్డారు. అల్లు అర్జున్ కు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం లీగల్ నోటీసులు పంపించాలని నిర్ణయించింది. ఆ యాడ్ లో అల్లు అర్జున్ ఓ హోటల్లో దోసెలు వేస్తుంటారు. ఓ వ్యక్తి రాగా, అతడికి బైక్ ట్యాక్సీలో ప్రయాణం సుఖంగా ఉంటుందని, ఆర్టీసీ సిటీ బస్సులో ఎక్కితే కుర్మా వేసి ఖీమా కొట్టి మసాలా దోసెలా చేసేస్తారని చెబుతారు. ర్యాపిడో బైక్ ట్యాక్సీ ఎక్కాలని అతడిని బన్నీ ప్రోత్సహిస్తారు. అయితే ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ బస్సులను, సంస్థ సేవలను కించపరిచేలా యాడ్ ఉందని, ఇలాంటి ప్రచారాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నటులు, ఇతర సెలబ్రిటీలు ఇలాంటి వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆలోచించుకోవాలని సూచించారు.

ఇక భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌ న్యూస్ చెప్పింది. మెట్రో రైళ్ల సమయాన్ని సవరించిన అధికారులు ఇకపై ఉదయం 6 గంటలకే తొలి రైలు పరుగులు ప్రారంభిస్తుందని తెలిపారు. నేటి నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్ ఎం ఆర్) తెలిపింది. తొలి రైలు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని, చివరి రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించింది. ప్రస్తుతం తొలి రైలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అవుతుండగా మరో గంటముందు తొలి రైలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌ కు ట్వీట్ చేశారు. ఆ సమయంలో మెట్రో స్టేషన్ల వద్ద వేచి చూస్తున్న ప్రయాణికుల వీడియోను పోస్టు చేశారు. దీంతో ఈ విషయాన్ని మంత్రి మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మెట్రో రైలు ఎండీ రైలు వేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.