Begin typing your search above and press return to search.

మద్యం ఆదాయంపై తెలంగాణ సర్కార్ నజర్

By:  Tupaki Desk   |   14 Aug 2021 7:30 AM GMT
మద్యం ఆదాయంపై తెలంగాణ సర్కార్ నజర్
X
కొత్త లిక్కర్ పాలసీపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 1200 కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్సైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది.

తాజాగా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండడంతో మద్యం అమ్మకాలపై మరింతగా తెలంగాణ సర్కార్ ఫోకస్ పెడుతోంది. అక్టోబర్ లో మద్యం షాపుల లైసెన్స్ గడువు ముగియనుండడంతో ఇప్పటి నుంచే కొత్త మద్యం పాలసీని అమలు చేసేందుకు ప్లాన్ చేసింది.

మద్యం అమ్మకాల్లో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే రికార్డులు నమోదు చేసింది. లాక్ డౌన్ ముగిసిన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా అక్షరాల రూ.2623 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. నెల వ్యవధిలో ఇంత భారీగా మద్యం అమ్మకాలు సాగటం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఆల్ టైం రికార్డుగా చెబుతున్న ఈ వైనం అధికారులను మాత్రమే కాదు.. ప్రభుత్వ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

గత ఏడాది అక్టోబరులో తెలంగాణ వ్యాప్తంగా సాగిన మద్యం అమ్మకాలు కేవలం రూ.1,663 కోట్లు మాత్రమే జరిగింది. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది అదే అక్టోబరులో నెలలో ఏకంగా వెయ్యి కోట్ల మేర మద్యం అమ్మకాలు సాగటం విశేషం. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఎంత భారీగా వినియోగిస్తున్నారో అర్థం అవుతోంది.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారీగా అమ్మకాలు జరగటానికి కారణం ధరలు పెరగటం ఒకటిగా చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది బీర్ కేసులు వినియోగం తగ్గగా.. లిక్కర్ అమ్మకాలు భారీగా పెరిగినట్లుగా గుర్తించారు. ఏది ఏమైనా కరోనా దెబ్బకు ప్రభుత్వ ఆదాయం తగ్గిందన్న వేళ.. మద్యం అమ్మకాలు ఇంత భారీగా పెరగడంతో ప్రభుత్వ ఖజానాకు బూస్టింగ్‌ లభించినట్లయింది.

రాష్ట్రంలో మొత్తం 200 లిక్కర్ స్టోర్ లు, 2216కు పైగా లిక్కర్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్ లో పదుల సంఖ్యలో పబ్బులు, వందల సంఖ్యలో బార్లు ఉన్నాయి. మద్యం ద్వారానే తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురుస్తోంది.

2019 సెప్టెంబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రెండేళ్ల లైసెన్స్ గడువు కోసం షాపులు, బార్లు, లిక్కర్ స్టోర్ ల ఓనర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఈ టెండర్ల ద్వారా రెండేళ్లకు గాను కేవలం లైసెన్స్ ఫీజులే ఎక్సైజ్ శాఖకు 600 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ గడువు అక్టోబర్ తో ముగియనుంది. దీంతో కొత్త టెండర్లు వేయాలని బిడ్డర్లను ఆహ్వానించేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 80 కొత్త బార్లకు ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. పలు కారణాల వల్ల లైసెన్స్ పొందిన షాపులు నిర్వహణలో లేవని ఎక్సైజ్ శాఖ తేల్చింది. వీటి స్థానంలో మరో 200 కొత్త లిక్కర్ స్టోర్లకు అనుమతివ్వాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మండలాలు, మున్సిపాలిటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో లిక్కర్ షాపులకు అనుమతివ్వాలని ఎక్సైజ్ శాఖ ఆలోచనగా తెలుస్తోంది.

కొత్తగా రానున్న మద్యం పాలసీలో వేలం కోసం దరఖాస్తు ఫీజును కూడా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. దీని ద్వారా 1200 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తోంది.

2015-17 వేలం సమయంలోనే దరఖాస్తు ఫీజు 50వేల రూపాయలు ఉండగా.. గత వేలం పాటలో దీని ధరను లక్ష రూపాయలకు పెంచారు. తాజాగా రానున్న మద్యం పాలసీలో వేలంలో పాల్గొనే వారి దగ్గర నుంచి రూ.3 లక్షల రూపాయలను ఫీజుగా వసూలు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

తెలంగాణ ఎక్సైజ్ శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 4 స్లాబుల్లో లైసెన్స్ ఫీజులున్నాయి. 45 లక్షలు, 50 లక్షలు, 80 లక్షలు.. కోటి 20 లక్షల రూపాయలు స్లాబులుగా ప్రభుత్వం నిర్ణయించింది. లైసెన్స్ ధరలను పెంచే యోచనతో కొన్ని ఏరియాల్లో 5శాతం నుంచి 8శాతం వరకూ పెంచడానికి రెడీ అయ్యింది.