Begin typing your search above and press return to search.

రోజా ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ వ‌ద్ద ఆన్స‌ర్లున్నాయా?

By:  Tupaki Desk   |   4 Aug 2017 3:05 PM IST
రోజా ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ వ‌ద్ద ఆన్స‌ర్లున్నాయా?
X
నిన్న క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో వైసీపీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడిపై చేసిన వ్యాఖ్య‌ల‌పై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర లేసిందనే చెప్పాలి. పాల‌న‌ను గాలికొదిలేసి అవ‌కాశ‌వాద రాజ‌కీయాల‌కు తెర తీసిన చంద్ర‌బాబును న‌డిరోడ్డుపై కాల్చి చంపినా త‌ప్పు లేద‌న్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ఆస‌రా చేసుకుని నిన్న రాత్రి నుంచే టీడీపీ రాష్ట్రవ్యాప్త ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. తాజాగా నేటి ఉద‌యం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో రోడ్ల‌పైకి వ‌చ్చిన టీడీపీ నేత‌లు జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ ఆందోళ‌న‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ క్ర‌మంలో నంద్యాల‌లో పార్టీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి నామినేష‌న్ కార్య‌క్ర‌మం కోసం అక్క‌డే ఉన్న వైసీపీ కీల‌క నేత ఆర్కే రోజా... టీడీపీ ఆందోళ‌న‌ల‌పై త‌న‌దైన శైలిలో సెటైర్లు సంధించారు.

అంతేకాకుండా చంద్ర‌బాబుపై ప్ర‌తిప‌క్ష నేత హోదాలో జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో ఎలాంటి త‌ప్పు లేద‌ని తేల్చి చెప్పిన రోజా... ఒక వేళ జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్లో త‌ప్పుంటే... జ‌గ‌న్‌ పై టీడీపీ నేత‌లు - స్వ‌యంగా సీఎం హోదాలో ఉన్న చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల మాటేమిట‌ని ఆమె కాస్తంత సూటిగానే ప్ర‌శ్నించారు. ఓ ప్రైవేట్ న్యూస్ ఛానెల్‌ తో మాట్లాడిన సంద‌ర్భంగా జ‌గ‌న్‌ పై అటు అసెంబ్లీలోనూ... ఇటు బ‌య‌ట కూడా టీడీపీ నేత‌లు విరుచుకుప‌డిన ఘ‌ట‌న‌ల‌ను ఆమె ప్ర‌స్తావించారు. అసెంబ్లీ సాక్షిగా *నీ అంతు చూస్తాం. న‌న్ను ఎదురించిన వారు బ్ర‌తికి బ‌ట్ట క‌ట్ట‌లేరు* అంటూ జ‌గ‌న్‌ ను ఉద్దేశించిన చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లపై ఏమంటార‌ని రోజా ప్ర‌శ్నించారు. రాష్ట్ర పాల‌నా బాధ్య‌త‌ల్లో ఉన్న సీఎం చంద్ర‌బాబు ప‌లు వ‌ర్గాల‌ను కించ‌పరిచేలా చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏ కోణంలో అర్థం చేసుకోవాల‌ని, ఆ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు ఏమ‌ని స‌మాధానం చెబుతార‌ని కూడా ఆమె నిల‌దీశారు.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు చేస్తున్న ఫిర్యాదుల ఆధారంగా కేసులు కూడా న‌మోద‌య్యే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌న్న ప్ర‌శ్న‌కు స్పందించిన రోజా... జ‌గ‌న్ పై కేసులు న‌మోదు చేయ‌డం మిన‌హా ఇంకేమీ చేయ‌లేర‌ని ఘాటుగా స‌మాధాన‌మిచ్చారు. టీడీపీ నేత‌లు ఆడాళ్ల‌పై అత్యాచారాలు చేసినా కేసులుండ‌వ‌ని, అధికారుల‌ను కొట్టినా కేసులుండ‌వ‌ని, ఎస్పీలు స‌హా పోలీసు అధికారుల‌ను నిర్బంధించినా కేసులుండ‌వ‌ని, ఏకంగా రాజ‌కీయ హత్య‌లు చేస్తున్నా కేసులుండ‌టం లేద‌ని ఆమె ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా కాల్ మ‌నీ సెక్స్ రాకెట్‌ పై తాను పోరాటం చేస్తే... టీడీపీ ఎమ్మెల్యే అనిత‌ను తాను ఏదో అన్నాన‌ని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించార‌ని ఆమె అన్నారు. ఎవ‌రైనా ఎస్సీల్లో పుట్టాల‌నుకుంటారా? అంటూ ఆ సామాజిక వ‌ర్గాన్ని అవ‌మానించిన చంద్ర‌బాబుపై కేసులుండ‌వ‌ని ఆమె తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అయితే త‌మ‌తో పాటు అధికార పార్టీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని, ఓట్ల రూపంలో వారు తీర్పు చెబుతార‌ని రోజా వ్యాఖ్యానించారు.