Begin typing your search above and press return to search.

మహిళల పంతం..బాబు పాలన అంతం

By:  Tupaki Desk   |   26 Dec 2017 6:38 PM GMT
మహిళల పంతం..బాబు పాలన అంతం
X
వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు - ఎమ్మెల్యే ఆర్కే రోజా కొత్త నినాదం ఎత్తుకున్నారు. కదిరి నియోజకవర్గం దనియాని చెరువులో వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే రోజా మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌ను అరాచక ప్రదేశ్‌ గా - ఆడవారి ఆర్థనాధాల ప్రదేశ్‌ గా మార్చడని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఆడవారిపై దాడులు విపరీతంగా పెరిగాయని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖజిల్లా పెండుర్తి మండలం జెర్పిపోతులపాలెంలో అందరూ చూస్తుండగానే భూకబ్జాలకు అడ్డొచ్చిన మహిళలను టీడీపీ వివస్త్రను చేసి దాడి చేశారన్నారు. మహిళలు రాజకీయంగా - ఆర్థికంగా ఎదగాలని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అన్ని రకాలుగా తోడ్పాటును అందించారని గుర్తు చేశారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. అందుకు స్త్రీశక్తి మొత్తం ఏకం కావాలని రోజా పిలుపునిచ్చారు.

వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో వైయస్‌ ఆర్‌ సీపీ మహిళా విభాగం అంతా ధర్నాలు - రాస్తారోకోలు నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచిందని రోజా అన్నారు. బాధితురాలిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టించి, భూములు ఇప్పించేంత వరకు వదల్లేదన్నారు. వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో ఆ మహిళలకు న్యాయం చేశాం కానీ పోయిన పరువు తీసుకురాలేకపోయామన్నారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే ఆడవారిపై దాడులు విపరీతంగా పెరిగాయని రోజా మండిపడ్డారు. ఎమ్మార్వోపై దాడి చేసిన చింతమనేని - కాల్‌ మనీ సెక్స్‌రాకెట్‌ లో ఆడవారి జీవితాలు వ్యభిచారంలోకి దింపిన బుద్ధా వెంకన్న - మెడికల్‌ స్టూడెంట్‌ సంధ్యారాణి కేసులో నిందితులు - ఎందరో విద్యార్థినీల చావుకు కారణమైన నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కాదని రోజా అన్నారు.

చంద్రబాబు పాలన రావణాసురుడు - నరకాసురుడు కలిసి పరిపాలిస్తే ఎలా ఉంటుందో.. అలా చేస్తున్నాడని రోజా అన్నారు. గాంధీజీ అన్నట్లు అర్థరాత్రి ఆడవారు నడిరోడ్డుపై కాదు ప్రస్తుతం చంద్ర‌బాబు పాలనలో పట్టపగలు ఆడవారు నడిరోపై నడిచివెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి దుస్థితిని తీసుకొచ్చినందుకు చంద్రబాబు తలదించుకోవాలన్నారు. చంద్రబాబు పూర్తిగా మహిళా వ్యతిరేకి అని, ఆడపిల్ల పుట్టకనే అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఆడపిల్లకు జన్మనిస్తే ఆ తల్లికి రూ. 30 వేలు ఇస్తామని ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని రోజా మండిప‌డ్డారు. అంటే ఆంధ్రరాష్ట్రంలో నాలుగేళ్లుగా ఆడపిల్లే పుట్టలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. పండంటి పథకం కింద గర్భవతులకు పౌష్టికాహారం కోసం రూ. 10 వేలు ఇస్తానని మరిచాడని, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తానని ఇలా అడుగడుగునా మహిళలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నాడన్నారు. ఇలాంటి వ్యక్తిని మహిళలంతా కలిసికట్టుగా ఒకే నినాదంతో తరిమికొట్టాలన్నారు. ‘మహిళల పంతం.. చంద్రబాబు పాలన అంతం’ ఇదే నినాదంతో ఎన్నికల్లో చంద్రబాబు తరిమికొట్టాలన్నారు. అదే విధంగా రావాలి జగనన్న.. కావాలి జగనన్న.. అప్పుడు ఆంధ్రరాష్ట్రంలో మహిళల భవిష్యత్తు బాగుపడుతుందని రోజా అన్నారు.