Begin typing your search above and press return to search.

బతికున్న మనిషిపై రోడ్డేసేశారు

By:  Tupaki Desk   |   21 Sep 2015 7:43 AM GMT
బతికున్న మనిషిపై రోడ్డేసేశారు
X
మధ్యప్రదేశ్ లో దారుణ సంఘటన జరిగింది... రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి గుంతలో పడిపోతే.... ఆయన్ను బయటకు తీయకుండానే గుంతను పూడ్చేశారు. ఇంతటి నిర్లక్ష్యానికి ఏం చేసినా పాపం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

మధ్యప్రదేశ్ లోని కాట్ని జిల్లాలోని ఉడ్లానా-హతా మార్గంలో ఈ ఈ దారుణం జరిగింది. లటోరి బర్మాన్ (45) భార్యతో కలిసి రిషి పంచమి పండుగకు అత్తగారింటికి వెళ్లాడు. పండుగ తరువాత భార్య పుంటింటిలోనే ఉండిపోవడంతో బర్మాన్ శుక్రవారం రాత్రి తన సొంతూరికి బయలుదేరాడు. అయితే... ఆయనకు మద్యం అలవాటు ఉండడంతో దారిలో కనిపించిన దుకాణం వద్ద ఆగి తాగాడు. నడుచుకుంటూ వెళ్తుండగా మత్తు ఎక్కువ కావడంతో పడిపోయాడు... అయితే... ఆయన పడిన చోట పెద్ద గొయ్యి ఉండడంతో అందులో పడిపోయాడు.

ఆ తరువాత రోడ్డు పనులు చేస్తున్న వారు ఆ గుంతలో పడిన బర్మాన్ ను గుర్తించకుండా కంకర, మట్టి వేసి పూడ్చి పెట్టారు. కంకర - మట్టి వేస్తున్న సమయంలో మెలుకవ రావడంతో బర్మాన్ బయటకు రావడానికి ప్రయత్నించాడు. అయితే చెయ్యి మాత్రం బయటకు వచ్చింది. అతని ప్రాణాలు గుంతలోనే పోయాయి. ఆదివారం ఉదయం రోడ్డు మీద చేతిని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో విషయం బయటపడింది. బర్మాన్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ మృతుడి కుంటుంభానికి రూ. 50 వేలు నష్టపరిహారం ప్రకటించారు. కార్మికులు నిర్లక్ష్యంగా పనులు చెయ్యడం వలనే ఇలా జరిగిందని బర్మాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతయినాకానీ ఇంత గుడ్డిగా వ్యవహరించడం దారుణమే.