Begin typing your search above and press return to search.

ది డైలీ టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో కీలక విషయాల్ని చెప్పిన రిషి

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:02 AM GMT
ది డైలీ టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో కీలక విషయాల్ని చెప్పిన రిషి
X
బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో చివరి రౌండ్ వరకు అధిక్యతను ప్రదర్శించిన భారత సంతతికి చెందిన రిషి సునాక్ గురించి తెలిసిందే. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ ఎన్నికకు సంబంధించిన చివరి రౌండ్ త్వరలో షురూ కానుంది. ఈ ఎన్నిక కోసం రిషి సునాక్.. ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ లు దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. తమ వాదనలు వినిపిస్తుండటం తెలిసిందే. టోరీ ఓటర్లను తమ పక్షాన నిలబడేలా చేయటం కోసం వారు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వేళ.. ది డైలీ టెలిగ్రాఫ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు రిషి సునాక్.

బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో జాతివివక్షకు తావు లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పదవికి జరుగుతున్న రేసులో రిషి సునాక్ ఓడిపోతే.. బ్రిటన్ లో జాతివివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్ చేసిన వ్యాఖ్యలపై అడిగిన ప్రశ్నలకు రిషి సమాధానం ఇచ్చారు. అసలు జాతి వివిక్ష అన్న మాటకే అవకాశం లేదన్నారు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా లింగం.. జాతిని చూసి ఓటు వేయరని స్పష్టం చేశారు.

ఎవరు సరైన అభ్యర్థులో వారిని మాత్రమే ఎన్నుకుంటారన్నారు. అందుకు తన జీవితమే ఒక నిదర్శనమన్నారు. రిచ్ మాండ్ నుంచి టోరీ సభ్యులే తనను ఎంపీగా గెలిపించారని.. ప్రధానమంత్రి రేసులో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాంటి సందర్భంలో జాతివివక్షకు అస్కారం ఏది? అంటూ ప్రశ్నించారు. మరి.. ఈ వాదన ఎలా మొదలైంది? చర్చ ఎందుకు జరుగుతున్నట్లు? లాంటి ప్రశ్నలు తలెత్తని రీతిలో రిషి రియాక్టు అవుతూ.. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులనే విషయం మీద చర్చ జరిగే సమయంలో ఇలాంటివి వచ్చి ఉండొచ్చన్నారు.

ఇక.. మొదట అధిక్యతలో ఉండి.. తాజాగా రేసులో వెనుకబడ్డారన్నవార్తలు రావటం.. కొన్ని సంస్థలు జరిపిన సర్వేల్లో వెల్లడి కావటంపై అడిగిన ప్రశ్నకు రిషి స్పందిస్తూ.. తాను రేసులో వెనుకబడ్డానని.. సర్వేల్లో లిజ్ ట్రస్ కు విజయవకాశాలు ఎక్కువగా ఉన్న విషయాన్ని ఒప్పుకున్నారు. రేసులో తాను వెనుకబడినప్పటికీ.. తాను మాత్రం వెనక్కి తగ్గని.. చివరి ఓటు వరకు తాను పోరాడుతానని వెల్లడించారు.

బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్.. లిజ్ ట్రస్ లలో ఎవరిని ప్రధానిని చేయాలన్నది 1.75 లక్షల మంది టోరీ సభ్యులు తేల్చనున్నారు. అత్యధికులు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తే వారే తదుపరి ప్రధాని కానున్నారు. ఓటింగ్ లో భాగంగా ఈ-ఓటింగ్ నిర్వహిస్తారు. సెప్టెంబరు 5నాటికి ఈ ఓటింగ్ ముగుస్తుంది. అదే రోజు ఓట్లను లెక్కించి.. ఎన్నికల ఫలితాల్ని వెల్లడించనున్నారు. దాదాపు నెల ఐదు రోజుల పాటు కాబోయే బ్రిటన్ ప్రధానికి సంబంధించిన ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పక తప్పదు.