Begin typing your search above and press return to search.

తప్పు ఎవరి చేసినా కడిగేద్దాం.. ఈసారి వర్మ చేసింది అదే

By:  Tupaki Desk   |   14 April 2021 4:30 AM GMT
తప్పు ఎవరి చేసినా కడిగేద్దాం.. ఈసారి వర్మ చేసింది అదే
X
మంచిని మంచిగా.. చెడును చెడుగా చూసే రోజులు తగ్గిపోతున్నాయి. ఎవరేం మాట్లాడినా.. వారి మతం..కులం.. ప్రాంతం.. వారు అనుసరించే రాజకీయ విధానం.. వారి భావజాలం ఇలాంటివి చూసుకొని.. వారి వ్యాఖ్యలకు తీర్పులు ఇవ్వటం ఒక అలవాటుగా మారింది. కరోనా లాంటి ప్రత్యేక సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించే ప్రభుత్వాలు ఎవరైనా.. ఆ ప్రభుత్వాధినేతలు ఎంతటి పూజ్యునీయులే అయినా.. వారిని తప్పు పట్టకుండా ఉండాల్సిన అవసరం ఉందంటారా?

ఇలాంటి విషయాలపై చర్చ జరిగే వేళ.. అనూహ్యంగా ఇతర మతాలకు సంబంధించిన ప్రస్తావనను తీసుకొస్తుంటారు. నిజమే.. తప్పు ఎవరు చేసినా తప్పే. కుంభమేళ నిర్వహించటం ఎంత తప్పో.. ఇతర మతస్తులు భారీ ఎత్తున మత సంబంధిత కార్యక్రమాల్ని భారీగా నిర్వహించటం కూడా అంతే తప్పు. ఒకరిని వెనకేసుకురావటం.. మరికొరిని అదే పనిగా తిట్టటం మా ఉద్దేశం ఎంతమాత్రం కాదు. మతం ఏదైనా మానత్వం ముఖ్యం. మనిషి అనే వాడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కదా మతం.. ప్రాంతం లాంటివి. అందుకు భిన్నంగా మనిషి ఉనికికే ప్రమాదం వాటిల్లినప్పుడు.. వారు ఎవరైనా సరే.. వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది.

ఓవైపుదేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న వేళ.. ఉత్తరాఖండ్ లో నిర్వహిస్తున్న మహా కుంభమేళకు 31 లక్షల మంది హాజరు కావటం దేనికి నిదర్శనం? దానికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందులో కనిపిస్తున్న ‘మంది’ని చూస్తే వణుకు పుట్టాల్సిందే. ఎలాంటి సామాజిక దూరాన్ని పాటించకుండా.. శానిటైజర్.. ముఖానికి మాస్కులు లాంటివి ధరించకుండా..కేవలం భక్తి తప్పించి మరింకేమీ అక్కర్లేదన్న భావన మూఢత్వం కాకుండా మరేమవుతుంది?

మహాకుంభమేళకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక ట్వీట్ చేశారు. కుంభమేళకు వెళ్లిన దాదాపు 31 లక్షల మందిలో కేవలం 26మందికే కరోనా సోకినట్లు ప్రబుత్వం చెబుతోంది. అలా అయితే.. ఎలాంటి సమస్యా లేదు. హరిద్వార్ కేంద్రంగా ఒకవేళ కరోనా విస్పోటనం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అంటూ సూటిప్రశ్నను సంధించారు. వర్మ వేసిన ప్రశ్నపై హాట్ చర్చ నడుస్తోంది. ఇతర మతస్తుల కార్యకలాపాల్ని తప్పు పట్టరు కాదు.. కుంభమేళ లాంటి హిందువుల కార్యక్రమంపై బురద జల్లుతారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

ముందు మెదళ్లలో నుంచి ఇలాంటి చెత్తను తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. గత ఏడాది కరోనా ప్రారంభ సమయంలో ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్ సమావేశాలు.. అనంతరం వారు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లటం.. వారిని యుద్ధ ప్రాతిపదికన గుర్తించటం చేయటం తెలిసిందే. ఆ సందర్భంగా విపరీతమైన ఆందోళన వ్యక్తమైంది. వందల్లో ఉన్న వారిలో కొందరికి పాజిటివ్ వస్తేనే.. అంత హడావుడి జరిగితే.. కుంభమేళా లాంటి చోటుకు లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు.. కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందన్నది మాటల్లోచెప్పలేనిది. విడి రోజుల్లో వర్మ పోస్టుచేసే ట్వీట్ కు.. తాజా ట్వీట్ కు సంబంధమే లేదని చెప్పాలి. ముందస్తు హెచ్చరికగా చేసిన వర్మ ట్వీట్ ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అపార్థం చేసుకోవటం అంటే.. అంతకు మించిన ఖర్మ మరొకటి లేనట్లే.