Begin typing your search above and press return to search.

బాబు మాటలు అలా.. అధికారుల తీరు ఇలా..

By:  Tupaki Desk   |   15 July 2016 7:14 AM GMT
బాబు మాటలు అలా.. అధికారుల తీరు ఇలా..
X
ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓపక్క పెట్టుబడుల కోసం ఏపీ సీఎం కిందా మీదా పడుతూ.. వాళ్లని.. వీళ్లని బతిమిలాడుకుంటూ రాష్ట్రానికి రావాలని కోరుతుంటే.. ఇక్కడ పరిస్థితులు మరోలా ఉన్నాయని చెబుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారు తమ ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి.. మంత్రివర్గంలో వాటిపై అధికారికంగా నిర్ణయం తీసుకున్నాక సైతం.. అధికారులు వాటిని అమలుకు లైట్ అనటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓపక్క రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు.. ఆ దేశం.. ఈ దేశం అంటూ విదేశీ పర్యటనలు చేస్తూ.. కనిపించిన ప్రతిఒక్కరికి ఏపీ గురించి ప్రచారం చేస్తూ పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇందుకోసం తమ ప్రభుత్వం అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేసిందని.. ఇలా ఫైల్ ఇస్తే.. అలా అమలు నిర్ణయాలు వచ్చేస్తాయని ఉదరగొట్టేస్తున్నారు. అయితే.. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం. అధికారుల తీరు ఎంత దారుణంగా ఉందన్న విషయానికి రెవెన్యూ విభాగమే పెద్ద ఉదాహరణగా చెబుతున్నారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలకు చట్టప్రకారం కేటాయించాల్సిన భూముల విషయాన్ని క్యాబినెట్ మీటింగ్ లో చర్చించుకొని అధికారికంగా నిర్ణయం తీసుకున్నాక కూడా.. భూముల కేటాయింపుల కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.

ఇటీవల ఒక సంస్థకు చెందిన ప్రతినిధులు ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు వచ్చారు. ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలు ఇచ్చారు. వారికి అవసరమైన భూమిని కేటాయించాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకొని రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నాక కూడా దాన్ని అమలు చేయకపోవటం. దీంతో.. ఒళ్లు మండిన సదరు సంస్థకు చెందిన ప్రతినిధులు సీఎస్ టక్కర్ కు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యపోయిన ఆయన.. ఈ ఇష్యూ మీద ఆరా తీసినప్పుడు షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

మంత్రివర్గం ఆమోదం పొందిన ఫైళ్లను క్లియర్ చేసే విషయంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించటం.. నెలల తరబడి తమ వద్దనే ఫైళ్లను ఉంచేసుకోవటం.. సంస్థ ప్రతినిధులు చెప్పులు అరిగే వరకూ తిప్పించటం చేస్తున్నట్లు తేలింది. దీని వెనుకున్న అసలు విషయాన్ని గుర్తించిన టక్కర్.. రెవెన్యూ ముఖ్యాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వార్నింగ్ ఇవ్వటంతో పాటు.. ఒక ఉన్నతాధికారికి అదే రోజు సాయంత్రానికి 25 ఫైళ్లు క్లియర్ చేసి తనకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టిన ఉదంతం బయటకు వచ్చింది. సీఎస్ ఉగ్రరూపం దాల్చి ఆదేశాలు ఇవ్వటం.. తాను చెప్పినట్లు పని జరగకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న మాటతో కదలిన సదరు అధికారి రోజు వ్యవధిలో పాతిక ఫైళ్లు సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.

అంటే.. ఒక అధికారి తలుచుకుంటే పని తీరు ఎలా ఉంటుందనటానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇదే తీరులో పని చేస్తే.. ఫైళ్లు ఎలా పరుగులు తీస్తాయో అర్థమవుతుంది. కానీ.. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించాలని.. పని విషయంలో తప్పులు చేసే వారు.. ఏపీ ఇమేజ్ ను.. తన మాటల్ని తోసి రాజన్నట్లుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులపై కొరడా విదల్చాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. చూసీ చూడనట్లు వ్యవహరిస్తే.. పరిస్థితులు మరింత దయనీయంగా మారతాయని చెబుతున్నారు. మరి.. బాబు మార్క్ చర్యల కొరడా బయటకు తీస్తారా..?