Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఖాతాలో ప్ర‌పంచ రికార్డు!

By:  Tupaki Desk   |   4 Dec 2016 10:23 AM IST
కేసీఆర్ ఖాతాలో ప్ర‌పంచ రికార్డు!
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై టీటీడీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మ‌రోమారు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ వికలాంగుల విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో రేవంత్ మాట్లాడుతూ...ప్రపంచంలోనే అబద్ధాల పుస్తకమంటూ ఏదైనా ఉందంటే అది అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టిన కేసీఆర్ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టో మాత్రమేనని ధ్వజమెత్తారు. అలాంటి ప్ర‌పంచ రికార్డు సంపాదించుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక్క‌రేన‌ని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల హామీల‌ను పూర్తిగా గాలికి వ‌దిలేసి..8 నెలల కాలంలో 9 ఎకరాల స్థలంలో 150 గదులతో భవనాన్ని ఏర్పాటు చేసుకున్న కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం నిర్మించుకున్నార‌ని రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ముతో నిర్మించుకున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విమలక్క కార్యాలయంపై పోలీసులతో దాడులు చేయడంలో అర్థం ఏమిటని రేవంత్ రెడ్డి నిల‌దీశారు.


తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరామ్‌లాంటి వారిని సిగ్గు లేదని మాట్లాడటం కేటీఆర్ దొరతనానికి నిదర్శనమని, కేటీఆర్ భాష మార్చుకోవాలని రేవంత్ రెడ్డి సూచించారు. తనతో కలసి సమావేశంలో పాల్గొన్నందుకు కోదండరామ్‌కు సిగ్గు లేదన్న కేటీఆర్... 2001 నుండి 2007 వరకు కేసీఆర్‌ కు కోదండరామ్ తెలంగాణ ఉద్యమంలో ఎంత సహకరించాడో తండ్రిని అడిగి తెలుసుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో విదేశాలలో ఉండి హోటళ్లలో చిప్పలు, బాత్ రూంలు కడిగిన కేటీఆర్‌ కు తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్‌ ను విమర్శించే స్థాయి ఎక్కడిదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను మరచిపోయి వారి పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గోదావరి జిల్లాలో పుట్టిన చినజీయర్ స్వామిని సీఎం కుర్చీలో కూర్చోపెట్టడం సిగ్గుమాలిన చర్య కాదా? అని ప్రశ్నించారు. మదం ఎక్కి దొర అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్‌ను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమయిందని రేవంత్ రెడ్డి చెప్పా రు. తనతో వేదికలలో పాల్గొన్న కోదండరామ్‌ ను సిగ్గు లేదని తిడ్తున్న కేటీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాల పార్లమెంట్‌ లో అడ్డుకున్న కాంగ్రెస్ నేత కేవీపీతో కేసిఆర్ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన తుమ్మల నాగేశ్వర్ రావు, తలసానిలు కేసీఆర్‌కు తీపి అయ్యారని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమ కారులు చేదు అయ్యారని రేవంత్ విమర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/