Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో పోటీపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

By:  Tupaki Desk   |   26 Jan 2022 6:30 AM GMT
వచ్చే ఎన్నికల్లో పోటీపై రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన
X
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో 75 వేల సభ్యత్వం సాధించినందుకు కాంగ్రెస్‌ క్యాడర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భావోద్వేగానికి గురైన రేవంత్‌ ఈ ప్రకటన చేశారు. 75 వేల భారీ సభ్యత్వంతో కొడంగల్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలోనే కాకుండా యావత్ దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిచిందన్నారు.

మంగళవారం కోస్గిలో జరిగిన కార్యక్రమంలో తమ తమ పోలింగ్ బూత్‌లలో 500 మందికి పైగా సభ్యులను నమోదు చేసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఆయన సన్మానించారు. తాను ఎమ్మెల్యేగా కొడంగల్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు కొడంగల్‌ పరిస్థితి ఎలా ఉందో అన్ని గ్రామాల్లో చర్చలు జరపాలని, ప్రజలతో మమేకం కావాలని పార్టీ క్యాడర్‌ను కోరారు. ఈ సీటును టీఆర్‌ఎస్‌ గెలుచుకున్న తర్వాత తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నామని ప్రజలకు అర్థమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక గుళ్లు, పాఠశాలలు, రోడ్లు, 5వేల సబ్ స్టేషన్లు, కోస్గి బస్ డిపోలను అభివృద్ధి చేసి మద్దూరులో తన సొంత స్థలంలో పాఠశాలను స్థాపించారని పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. కొడంగల్, కోస్గి, మద్దూరులో కూడా జూనియర్ కళాశాలను తీసుకొచ్చానని, కొడంగల్‌లో డిగ్రీ కళాశాలను స్థాపించామన్నారు. కొడంగల్‌లో అద్భుతమైన రోడ్డు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి, అన్ని గ్రామాలకు నీటి ట్యాంక్‌ను అందించారు.

ఎమ్మెల్యే హోదాలో రూ.350 కోట్లతో కొడంగల్ కు తాగునీరు తీసుకొచ్చామన్నారు. కోస్గిలో 50 పడకల ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు, అయితే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచిన తర్వాత ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేదు. 2018లో కొడంగల్‌లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని రేవంత్‌రెడ్డి అన్నారు.

కొండంగల్‌ను దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కె.తారకరామారావు ప్రకటించారని తెలిపారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కోస్గి బస్ డిపోకు 2018లో ఐదుగురు మంత్రులు శంకుస్థాపన చేశారని తెలిపారు. కానీ పనులు మాత్రం అసంపూర్తిగానే ఉన్నాయి. గత మూడేళ్లుగా కొడంగల్ రోడ్లపై మట్టిని కూడా తొలగించలేదు. కొడంగల్‌లో అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ నేతలకు సవాల్‌ విసిరారు.

ప్రజలకు తేడా చూపాలనే ఉద్దేశంతోనే తాను మూడేళ్లుగా కొడంగల్‌లో పర్యటించలేదన్నారు. కొడంగల్‌లో కాకుండా సిద్దిపేట, గజ్వేల్‌లోనే ఎందుకు అభివృద్ధి జరుగుతోందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఒక్కటే అభివృద్ధి అని చెప్పలేమని ఎద్దేవా చేశారు. మొత్తం తనకు రాజకీయ జన్మనిచ్చిన కొడంగల్ నే వచ్చే ఎన్నికల్లో పోటీకి రేవంత్ రెడ్డి ఎంపిక చేసుకోవడం గమనార్హం.