Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ సీనియర్లకి టార్గెట్ గా రేవంత్ .. ఏం చేసాడంటే ?

By:  Tupaki Desk   |   7 Nov 2019 10:56 AM GMT
కాంగ్రెస్ సీనియర్లకి టార్గెట్ గా రేవంత్ .. ఏం చేసాడంటే ?
X
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకి ఇప్పుడు ఆ ఒక్కడి పై ఫుల్ ఫైర్ లో ఉన్నారు. గత కొన్నేళ్లుగా పార్టీలో ఉన్న మాకు లేని గౌరవం మొన్న మొన్ననే పార్టీలోకి వచ్చిన వారికీ ఇవ్వడం ఏంటి అని గాంధీ భవన్ సాక్షిగా మండి పడ్డారు. అది కూడా కాంగ్రెస్ జాతీయ నాయకుడు ఉన్న సమయంలో ..అసలు టీ పీసీసీ రేసులో ముందున్న ఆ కీలక నేత అంటే సీనియర్లకి ఎందుకు అంత కోపం. ఇప్పటికే తెలంగాణ లో కాంగ్రెస్ పతనం వైపు చాలా స్పీడ్ గా నడుస్తోంది. అలాగే ఈ మద్యే జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఇక ప్రస్తుతం తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె , తహసీల్దార్ విజయారెడ్డి హత్యతో అట్టుడికి పోతున్న నేపథ్యంలో, తెలంగాణలో కాంగ్రెస్‌ తిరిగి పటిష్టం చేయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆలోచిస్తోంది. గతంలో ఎదురైన ఓటమిల నుండి గుణపాఠాలు నేర్చుకొని .. పార్టీలో సమూల మార్పు తేవాలని అధిష్టానం చూస్తుంది. దీనికోసం టీపీసీసీకి కొత్త అధ్యక్షున్ని నియమించాలని భావిస్తోంది. అయితే ఇదే వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ లో చీలికలు తెస్తుంది.

తెలంగాణ లో కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితిని సమీక్షించేందుకు హైదరాబాద్‌ వచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. ఈ నేపథ్యం లోనే కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అయిన విహెచ్ , షబ్బీర్ అలీ గొడవపడటం తో ఆ సమావేశం రసాభాస గా తయారైంది. ఈ గొడవ మొత్తం రేవంత్ రెడ్డి కేంద్రంగా జరిగినట్టు సమాచారం. ఎందుకంటే, రేవంత్‌ను టీపీసీసీ చీఫ్ చేస్తారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని , మొన్న హుజూర్ నగర్ బరిలో ఉత్తమ్ భార్య పోటీ చేస్తారని ప్రకటించినప్పుడు కూడా, రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేయడంపై, వీహెచ్‌ వంటి సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనవసరంగా అధిక ప్రాధాన్యత ఇస్తున్నందుకే రేవంత్‌ రెచ్చిపోతున్నారని, ప్రగతి భవన్‌ ముట్టడి వంటి సొంత నిర్ణయాలను పార్టీపై రుద్దుతున్నారని మండి పడ్డారు. అయితే మరో విషయం ఏమిటంటే ..టీ పీసీసీ పదవిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వి. హనుమంత రావు కూడా ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనని కాదు అంటే , బీజేపీ వైపు చూస్తానని కూడా పరోక్ష సంకేతాలు చాలాసార్లు ఇచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ సీనియర్లు టీపీసీసీ తమకి ఇచ్చినా , ఇవ్వక పోయినా కూడా రేవంత్ కి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ కి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయడం పార్టీకి కత్తి మీద సాము లాంటిందే. కానీ , వందేళ్ల సుదీర్ఘమైన చరిత్ర గల కాంగ్రెస్ కి ఈ వ్యవహారం ఎలా పరిష్కరించాలో చెప్పాల్సిన పని లేదు. అతి త్వరలోనే టీపీసీసీ పదవి పై ఒక స్పష్టత ఇచ్చి పార్టీని మళ్ళీ గాడిన పెట్టాలని ఆలోచిస్తోంది. కానీ , ఈ వ్యవహారం మొత్తం మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తరువాతనే అని తెలుస్తోంది.