Begin typing your search above and press return to search.

రిజ‌ర్వేష‌న్లు... ఓ చ‌ర్చ‌

By:  Tupaki Desk   |   28 Aug 2015 9:42 AM GMT
రిజ‌ర్వేష‌న్లు... ఓ చ‌ర్చ‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ సొంత రాష్ర్టం గుజ‌రాత్‌ లో ప‌టేల్ సామాజిక‌వ‌ర్గం వారు త‌మ‌ను ఓబీసీ సామాజిక వ‌ర్గంలో చేర్చాలంటూ చేస్తున్న ఉద్య‌మం కాస్త నిర‌స‌న రూపం దాల్చింది. రాష్ర్టంలో అప్ర‌క‌టిత క‌ర్ఫ్యూ విధించాల్సిన ప‌రిస్థితి ఎదుర‌యింది. లాఠీచార్జీలు, రాస్తారోకోలు కామ‌న్ అయిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఒక్క‌సారిగా దేశ‌వ్య‌ప్తంగా రిజ‌ర్వేష‌న్ల అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో రిజ‌ర్వేష‌న్ల‌పై ఓ ఆస‌క్తిక‌ర‌ చ‌ర్చ‌...

శతాబ్దాలు పాటు కొన్ని జాతుల వారు అణచివేతకు గురయ్యారు. నిరక్షరాస్యత, సమాజంలో చిన్నచూపుతో బతికారు. దీంతో, మిగిలిన వారితో పాటు సమాన అవకాశాల కోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పుడు రిజర్వేషన్లు దుర్వినియోగం అవుతున్నాయా? వీటి ప్రయోజనాలను కొందరు మాత్రమే అనుభవిస్తున్నారా? మిగిలిన వారు వీటి ఫలాలు పొందడం లేదా అంటే అవుననే అంటున్నారు మేధావులు. సమాజంలో అసమానతలు కొనసాగినంత కాలం, అస్పృశ్యత, అంటరానితనం ఉన్నంత కాలం రిజర్వేషన్లు అవసరమనేది ఇంకొందరి అభిప్రాయం. అయితే, రిజర్వేషన్ల పై క్రిమిలేయర్‌ రావాలని దీనివల్ల మరింత మందికి ఉన్నత అవకాశాలు వస్తాయంటున్నారు. ఇంతకీ, క్రిమిలేయర్‌ ఎందుకు? ఇది వస్తే.. ఏం అవుతుంది. ముందుగా క్రిమిలేయర్‌ ఎందుకో చూద్దాం..

క్రిమిలేయర్‌ ఎందుకు?

రిజర్వేషన్ల కారణంగా ఉన్నత స్థానాలు పొందినవారు, పైకెదిగిన వాళ్లు, ఆ వ్యక్తుల కుటుంబాలు మాత్రమే లబ్ది పొందుతున్నారు. దీనివల్ల ఆ కులంలోనే మిగిలిన వాళ్లకు ఆ రిజర్వేషన్లే అడ్డుగోడలుగా మారుతున్నారని విమర్శ. దీంతో, మిగిలిన వాళ్లు నష్టపోతున్నారు. దీనివల్ల రిజర్వేషన్ల పరమార్ధం ఎంతవరకూ నెరవేరిందన్నది ప్రశ్నార్ధకం. ఇప్పటికే దేశంలో మెజారిటీ జనాభా ఏదో ఒక రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పరిస్థితుంది. అందుకే.. రిజర్వేషన్ల వల్ల ఒక్కసారి లబ్ది పొందిన కుటుంబం మళ్లీ వాటిని పొందకుండా ఉండటం కోసమే క్రిమిలేయర్.

ఉదాహరణకి ఒక ఐఏఎస్‌ ఆఫీసర్ 1960ల్లో సర్వీస్‌ లో చేరితే, ఆతర్వాత కాలంలో ఆయన కుటుంబీకులు కూడా ఈ రిజర్వేషన్‌ వల్ల లబ్ది పొంది ఉన్నతస్థాయికి చేరుకుంటున్నారు. దీనివల్ల ఆ వర్గంలో ఐఏఎస్‌ ఆఫీసర్ కుటుంబం మాత్రమే ఎక్కువ లబ్ది పొందుతోంది. మరి, మిగిలిన వారి మాటేంటి? ఈ ప్రశ్నకు ఆ కుల సంఘాలు కూడా సమాధానం ఇవ్వవు. అస్సలు రిజర్వేషన్‌ పై చర్చను కూడా అంగీకరించవు.

రిజర్వేషన్లలో క్రిమిలేయర్ వస్తే.. ఆర్థికంగా, ఉన్నతస్థాయిలో ఉన్నవాళ్లకు రిజర్వేషన్‌ లు లభించవు. దీనివల్ల మిగిలిన వాళ్లు బాగుపడతారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అంటున్నారు. ఈ అంశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నా.. జయప్రకాశ్‌ నారాయణ, రాఘవులు లాంటి వాళ్లు క్రిమిలేయర్‌ వస్తే మంచి జరుగుతుందంటున్నారు.

ఆర్థికంగా, సామాజికంగా స్థిరపడిన వాళ్లు తమ రిజర్వేషన్లు స్వచ్చందంగా వదులుకుంటే.. అదే వర్గంలోని మిగిలిన వాళ్లు దీనివల్ల లబ్దిపొందుతారు. దీనివల్ల సామాజిక బలహీనుడికి ప్రయోజనం కలుగుతుంది. అయితే, దీనికి ఏ ఒక్కరు ఒప్పుకోరు. మేం ఎందుకు వదలుకోవాలని ఎదురు ప్రశ్నిస్తారు.

ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

నిజానికి, రిజర్వేషన్లు ఉండాలా? వద్దా అన్నది ప్రశ్నకాదు. చర్చ అంతకంటే కాదు. రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు పొందినవారు, వాళ్ల పిల్లలు, అధిక ఆదాయవర్గాలు తమకున్న రిజర్వేషన్లు వదులుకోవటం వల్ల.. ఆ కులంలోని ఇతరులు వాటివల్ల లబ్దిపొందుతారు. ఇది గుర్తించిన నాడు.. సమసమాజ అభివృద్ధి, అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయి.

ఇది కేవలం ఉద్యోగాల్లోనే కాదు. సమాజంలోని అన్నింటిలోను. రిజర్వేషన్ల వల్ల వెనకబడ్డవర్గాలకి ఒరిగిందేమన్నా ఉందా అంటే.. ఎవ్వరి దగ్గరనుంచి సమాధానమే ఉండదు. దీనిపై సర్వేలు చేయరు. గణాంకాలు తీయరు. అవి తీస్తే.. ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇబ్బందని. గతంలోను దీనిపై సుప్రీం కోర్టులో పిల్‌ దాఖలైంది. అందులో రిజర్వేషన్లు పొందుతున్న కులాల్లో 9 శాతానికి పైగా ఇంతవరకు వాటిని ఉపయోగించుకున్న దాఖలాలు కూడా లేవని పిటీషనర్‌ తెలిపారు. అయితే, దీన్ని కదిలిస్తే.. తేనెతుట్టెను కదలించటమే అని భావించిన కేంద్రం.. ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీని ఫలితమే ఇప్పుడు గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ల్లో కుల ఉద్యమాలు.

కోటా వదులుకుంటే తమ సొమ్మేదో పోతుందనుకునే వాళ్లు ఉండటం వల్లే రిజర్వేషన్ల ఫలాలు అట్టడుగు ఉన్నవాళ్లకు అందటం లేదనేది జయప్రకాష్‌ నారాయణ లాంటి వాళ్లు అంటున్నారు. అంతెందుకు.. ప్రధాని మోడీ గ్యాస్‌ పై రాయితీ వదులుకోండి అంటే.. వదులుకున్న వాళ్లు ఎందరున్నారు? నేను ఎందుకు వదులుకోవాలంటూ ఎవ్వరూ ముందుకు రావటం లేదు. అదే..గ్యాస్‌ పై పూర్తిగా సబ్సిడీ ఇస్తామంటే.. అలాంటి తాయిలాలందుకోటానికి అందరూ సిద్ధంగా ఉంటారు.

మన బలహీనత ఆసరాగా పార్టీలాడే రాజకీయ చదరంగంలో పావులం మనమే. వ్యక్తిగత స్వార్ధాలకు సంఘ హితాన్ని బలిపెడుతున్నది మనమే. మనం మారందే, మన దేశాన్ని ఎవ్వరూ బాగుచేయరు. మన దగ్గర కుల ఆధారిత రిజర్వేషన్లే దండగనే వాదన కూడా ఉంది. రిజర్వేషన్స్‌ను కులమతాలతో సంబంధం లేకుండా కుటుంబాల ఆర్ధిక స్థితిగతులని బట్టి ఇవ్వాలనే ప్రతిపాదన ఎప్పటినుండో ఉంది. వాటిని పట్టించుకుంటున్న పాపాన మాత్రం ఏ ప్రభుత్వమూ పోలేదు. ఎలా పోతుంది? అలా చేస్తే ఓటు బ్యాంకులేం కావాలి? అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్లు ఇస్తే.. ఓటు బ్యాంకులు చీలిపోతేయనే భయం రాజకీయ పార్టీల్లో ఉంది.

ముక్తాయింపు..

ఇప్పుడు వస్తున్న ఉద్యమాలన్నీ.. కులాల ప్రాతిపదికనే. మరి, వీటికి పరిష్కారం కనుక్కోలేకపోతే, భవిష్యత్‌ లో పోరుబాటలో మరిన్ని కులాలు వచ్చి చేరతాయి. అందులోను.. రిజర్వేషన్లు పొందుతున్న కులాలు ఉన్నా ఆశ్చర్యపోనవసరం లేదని సామాజిక విశ్లేషకులు అంటున్నారు. మరి, స్వచ్ఛందంగా రిజర్వేషన్లు వదులుకోవటానికి వాటివల్ల లబ్దిపొందుతున్నవాళ్లు సిద్ధమవుతారా అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.