Begin typing your search above and press return to search.

'టీకా' ధరలు తగ్గించండి .. సీరం, భారత్ బయోటెక్‌లకి కేంద్రం విజ్నప్తి !

By:  Tupaki Desk   |   27 April 2021 5:30 AM GMT
టీకా ధరలు తగ్గించండి .. సీరం, భారత్ బయోటెక్‌లకి కేంద్రం విజ్నప్తి !
X
దేశంలో కరోనా వైరస్ విజృంభణ ఓ రేంజ్ లో కొనసాగుతుంది. ప్రతి రోజు కూడా కొన్ని వేల మంది మరణిస్తుండగా, లక్షల్లో కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇక మే 1 నుంచి 18 ఏళ్లు పైబ‌డిన వారంద‌రికీ భారీ వ్యాక్సినేష‌న్‌ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ ధ‌ర‌ల‌ను తగ్గించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం త‌యారీ సంస్ధ‌లు సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భార‌త్ బ‌యోటెక్ సంస్థల‌ను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేంద్రానికి తక్కువ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధరకు వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ రెండు కంపెనీలు నిర్ణయించడంపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు గుప్పించాయి. ఒకే దేశం ఒకే టాక్స్ అని చెప్పిన కేంద్రం.. వ్యాక్సిన్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తిగా వ్యవహరిస్తోందని పలు రాష్ట్రాలు ఆరోపించాయి. దీనితో టీకా ధరలు తగ్గించాలని కేంద్రం కోరింది.

కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగింది. అనంతరం వ్యాక్సిన్ కంపెనీలకు కేంద్రం ఈ మేరకు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ రెండు కంపెనీలు ఇంతకుముందు నిర్ధారించిన ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. తాము ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్‌ డోసులను రాష్ట్రాలకు రూ. 600, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1200 ఇవ్వాలని భారత్ బయోటెక్ నిర్ణయించింది. ఇక సీరం ఇన్స్‌టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను రాష్ట్రాలకు రూ. 400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 600కు ఇవ్వాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఈ రెండు కంపెనీలు తాము ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లలో 50 శాతాన్ని కేంద్రానికి రూ. 150కే ఇవ్వాలని నిర్ణయించాయి. అయితే, ఈ ధ‌ర‌ల వ్య‌త్యాసం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు విపక్ష పార్టీల నేతల నుంచి వ్య‌తిరేక‌త రావ‌డంతో వ్యాక్సిన్ ధ‌ర‌లను తగ్గించాల‌ని వ్యాక్సిన్ త‌యారీ సంస్ధ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం కోరింది. కాగా,కేంద్ర ప్ర‌భుత్వ అభ్య‌ర్ధ‌నపై సీరం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా భార‌త్ బ‌యోటెక్ స్పంద‌న ఎలా ఉంటుంద‌నేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా.. జనవరి 16 నుంచి సోమవారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా 14.19 కోట్లకుపైగా టీకా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.