Begin typing your search above and press return to search.

ఏటీఎం కష్టాలు తీరేది అప్పుడేనట..

By:  Tupaki Desk   |   18 March 2017 6:09 AM GMT
ఏటీఎం కష్టాలు తీరేది అప్పుడేనట..
X
పెద్దనోట్ల రద్దు తర్వాత ఏటీఎం కౌంటర్లు బంద్ చేయటం.. డబ్బుల కోసం ప్రజలు పడిన పాట్లు అన్నీఇన్నీ కావు. కారణాలు ఏమైతేనేం.. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏటీఎం కష్టాలతో సాధారణ ప్రజానీకానికి చుక్కలు కనిపించాయి. నవంబరులో మొదలైన ఈ ఎపిసోడ్.. జనవరి రెండో వారం వరకూ కొనసాగింది. సంక్రాంతికి పరిస్థితి సద్దుమణిగి.. ఒక కొలిక్కి వచ్చింది. హమ్మయ్యా.. ఏటీఎం కష్టాలు తొలగినట్లేనని జనాలు ఫీల్ అవుతున్నంతనే మళ్లీ ఏటీఎంల ముందు నోక్యాష్ బోర్డులు కనిపించటం షురూ అయ్యాయి. గడిచిన రెండు వారాలుగా ఏటీఎంలు పని చేయని పరిస్థితి. కారణం ఏమిటన్నది అధికారులు కానీ పాలకులు కానీ ఇప్పటివరకూ వివరణ ఇచ్చింది లేదు.

ఎప్పటివరకూ ఏటీఎం కష్టాల మీద క్లారిటీ లేని పరిస్థితి. కారణం తెలీకుండా.. ఎంత కాలం పాటు కొనసాగుతుందో తెలీని సందిగ్థ పరిస్థితుల్లోకి చిక్కుకుపోయారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఈ నెల 13 నుంచి విత్ డ్రా మీద పరిమితులు ఎత్తేసినట్లుగా చెబుతున్నప్పటికి.. తాజాగా మొదలైన నోట్ల కొరతతో బ్యాంకులు సైతం పరిమితంగా డబ్బులు చెల్లిస్తున్న పరిస్థితి. దీంతో.. డబ్బులు డ్రా చేసుకుందామని వస్తున్న బ్యాంకు ఖాతాదారులకు నో క్యాష్ అంటూ షాకిస్తున్నాయి.

దీంతో.. ఏం చేయాలో అర్థం కాని అయోమయంలో సామాన్య జీవి చిక్కుకుపోయాడు. ఇంతకీ.. తాజా కొరత ఎందుకు ఏర్పడిందన్నది పెద్ద ప్రశ్న.దీనికి కొందరు చెబుతున్న సమాధానం ఏమిటంటే.. రూ.2వేల నోట్లు దాదాపు రూ.20వేల కోట్ల మేర ప్రజల దగ్గర ఉండిపోయాయని.. అవి తిరిగి బ్యాంకుల వద్దకు రాకపోవటంతోనే తాజా కొరత ఏర్పడినట్లుగా చెబుతున్నారు. ఇదే నిజమైతే.. ఆర్ బీఐ నుంచొ రెండు తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. బ్యాంకులు తీవ్రమైన నోట్ల కొరతను ఎదుర్కొంటున్నాయని.. అందుకే.. విత్ డ్రా మొత్తాల మీద పరిమితులు విధిస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. నోట్ల కొరతకు కారణం మరొకటి ఉందన్నమాట వినిపిస్తోంది. ఇప్పుడు ఏర్పడిన కొరత మొత్తం ఆర్ బీఐ పుణ్యమేనని చెబుతున్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో..బ్యాంకుల్లో డిపాజిట్ అయిన పాత మొత్తానికి సరిపడా కొత్త నోట్లను ఆర్ బీఐ పూర్తిగా విడుదల చేయలేదని.. తాజాగా మరింతగా నియంత్రిస్తుందని.. ఈ రెండు కారణాలతో నోట్ల కొరత మళ్లీ వచ్చి పడిందని చెబుతున్నారు.

ఈ వాదనకు బలం చేకూరేలా అధికారుల మాటలు ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత పాత నోట్లు దాదాపుగా రూ.80వేల కోట్ల మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిధిలోని బ్యాంకులకు వెళ్లగా.. ఇప్పటివరకూ రాష్ట్రానికి కేవలం రూ.45వేల కోట్ల కొత్త నోట్లు మాత్రమే వచ్చాయని.. ఆ లోటుకు తాజాగా ఆర్ బీఐ నుంచి రావాల్సిన సాధారణ మొత్తాలు కూడా ఆగిపోవటంతో క్యాష్ కొరత ఒక్కసారిగా మీద పడిందని చెబుతున్నారు. ఇలా సమస్యల మీద సమస్యలు మాత్రమే చెబుతున్న వైనం ప్రజలకు విసుగుతో పాటు.. ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. తమ క్యాష్ కష్టాలకు సొల్యూషన్ ఏమిటన్నఅంశంపై ప్రజలు నిలదీస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరత అంశాన్ని బ్యాంకులు..ఆర్ బీఐ దృష్టికి తీసుకెళ్లినట్లుగా చెబుతున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే.. ఈ నెలాఖరు నాటికి తెలంగాణకు రూ.4వేల కోట్లు.. ఏపీకి రూ.6వేల కోట్ల (సుమారుగా) నగదును పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయని..అవి వస్తే కానీ.. ఏటీఎంలు తమ పని తాము చేసుకుంటాయని..అప్పటి వరకూ ఏటీఎం అంటే.. ఎనీ టైం మొరాయించటమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/